ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పడంతో అన్నపై రాజకీయ యుద్ధానికి కాలు దువ్వుతోంది. సీఎం జగన్ను ఢీకొట్టి అధికారం చేజిక్కించుకునే వ్యూహాల్లో ఉంది. ఈ మేరకు తన తండ్రి ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఇవాళ ఇడుపులపాయకు వెళ్లనుంది షర్మిల. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కడపకు చేరుకుంటారు.
అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుని సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేసి.. రేపు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అటు కాంగ్రెస్ హైకమాండ్ రచిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది హైకమాండ్. తన అన్న అయిన సీఎం జగన్ బలగాన్ని దెబ్బతీసే యోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి అభిమానులైన వారిని హస్తం గూటికి చేర్చుకునే పనిలో పడ్డారు షర్మిల.
జగన్పై అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలెం వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు నేతలతో వరుసగా ఫోన్లో మంతనాలు నడిపిస్తున్న సమాచారం. దీంతో ఎన్నికల సమయానికి ఎవరెవరు అన్నా చెల్లెళ్లతో జట్టు కట్టనున్నారు..?, ఆ గట్టు నుంచి ఈ గట్టుకు చేరేదెవరెన్నదానిపై ఉత్కంఠ నెలకొనడంతో ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ మరింత హీట్ పెంచింది.
మరోవైపు.. షర్మిల కోసం KVP రంగంలోకి దిగారు. మూడ్రోరోజుల క్రితం హైదరాబాద్లోని KVP నివాసంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలకనిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఉండవల్లి, రుద్రరాజుకు ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలు.. రాయలసీమలో పార్టీ బలోపేతం చేసే పనిని.. రఘువీరారెడ్డి, శైలజానాథ్కు
అప్పగించారని సమాచారం. ఉత్తరాంధ్ర బాధ్యతలు KVP రామచంద్రరావు స్వీకరించనున్నట్లు సమాచారం. గుంటూరు, కృష్ణా, ప్రకాశం బాధ్యతలను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్లు సమాచారం. వైసీపీ అసమ్మతి, అసంతృప్తి నేతలతో వీరంతా టచ్ లోకి వెళ్తున్నారు. వైసీపీ నుంచి కాంగ్రెస్ గూటికి 30 మంది కీలకమైన నేతలు రానున్నట్లు సమాచారం.