YS Sharmila Dharna (today’s latest news):
ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రజలను తమవైపు తిప్పుకునే వ్యూహాల్లో బిజీగా ఉన్నారు AP PCC చీఫ్ వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా బరిలో నిలిచేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక అయిన ఏపీకి ప్రత్యేకహోదాపై షర్మిల ఫోకస్ పెట్టారు. ఢిల్లీ వేదికగా పోరాటానికి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. ఈ ఉద్యమం ద్వారా జాతీయ నాయకులను టార్గెట్ చేసే పనిలో పడ్డారు షర్మిల. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఆమె పలు పార్టీల ఎంపీలను కలిసి హోదాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వారికి వినతి పత్రాలు అందజేసి పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలని కోరారు.
NCP అధినేత శరద్ పవార్ తో భేటీ అయిన ఆమె ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించారు. ప్రత్యేక హోదాకు మద్దతివ్వాలని ఆయనను కోరారు. అనంతరం.. DMK ఎంపి తిరుచ్చి శివను కలిసి.. ప్రత్యేక హోదా గురించి వివరించి.. మద్దతు కోరారు. ఆ తర్వాత CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న షర్మిల.. ఆ రోజు నుంచీ ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీ పీసీసీ పగ్గాలు చేతికొచ్చాక.. అధికార వైసీపీపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కుటుంబంలో చీలికకు కారణం జగనన్నే అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపాయి. జగనన్న చేసిన వాటికి తన తల్లి విజయమ్మ, దేవమే సాక్ష్యమని షర్మిల చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని బాహాటంగానే రివర్స్ కౌంటరిచ్చారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమలయ్యే నాటికి.. ముక్కోణ పోరు తప్పదనేలా అక్కడి రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.