కడప పార్లమెంటు ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. వైయస్ కుటుంబం రాజకీయ అరంగేట్రం నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబం నుంచే కడప పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1989, 1991, 1996, 1998లో వైఎస్ఆర్ ఎంపీగా నాలుగసార్లు గెలిచారు. 1999, 2004లో వైఎస్ వివేకానంద ఎంపీగా రెండుసార్లు విజయం సాధించారు. ఇక ఆ తర్వాత 2004 నుంచి జగన్ కడప ఎంపీగా రెండుసార్లు గెలుపొంది.. అది వైఎస్ కంచుకోట అని నిరూపించారు. 1989 నుంచి నేటి వరకు కడప పార్లమెంటు స్థానానికి వైయస్ కుటుంబం మాత్రమే ప్రాతినిధ్యం వహించడం కడప జిల్లాలో వారికున్న పట్టు అర్థం అవుతుంది.
వచ్చే ఎన్నికల్లో మాత్రం కడప పార్లమెంటు సీటు కోసం రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అన్నతో విభేదించిన షర్మిల జగన్, అవినాష్ లక్ష్యంగా చేస్తున్న మాటల యుద్ధం ఏపీతో పాటు సొంత జిల్లా కడపలోనూ కాక రేపుతోంది. కడప ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల పోటీ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి వైయస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో కడప రాజకీయం పీక్స్ చేరింది. ఇది వైయస్ కుటుంబం తో పాటు ఆయన అభిమానుల్లో కూడా కొంత భయాన్ని కలిగిస్తుందట.
షర్మిల కడప పార్లమెంటు నుంచి బరిలో నిలిస్తే అవినాష్ లక్ష్యంగా విమర్శల దాడి ఉంటుందనేది కామన్. అది అవినాష్ రెడ్డి తో పాటు పార్టీకి ఎంతోకొంత డ్యామేజ్ చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. రెండు వైఎస్ కుటుంబాల మధ్య జరిగే ఫైట్ లో టీడీపీ లబ్ది పొందే అవకాశాలు లేకపోలేదు. టీడీపీ కూడా కడప పార్లమెంటుపై ఆశలు పెట్టుకుందట. షర్మిల తన సొంత కుటుంబం పై చేసే విమర్శలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. షర్మిల లక్ష్యం కూడా తాను గెలవకపోయిన తన తమ్ముడు అవినాష్ రెడ్డి ఓటమి కోరుకుంటున్నారట. షర్మిల కడప పార్లమెంట్ పై పోటీ చేస్తే కడప రాజకీయాల్లో పెనుమార్పులు మాత్రం తప్పవు.