YS Sharmila : నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లడం వైఎస్ఆర్ మార్క్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కడపలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె వైసీపీ ప్రభుత్వం విధానాలపై నిప్పులు చెరిగారు. ఆరోగ్య శ్రీ, 108.. ఇవన్నీ వైఎస్ఆర్ మార్క్ పథకాలు అని పేర్కొన్నారు.
చేసిన మేలు గుర్తు పెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్ అని షర్మిల స్పష్టంచేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం వైఎస్ఆర్ మార్క్ అని అన్నారు. ఇప్పటి పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నారని జగన్ ను ఉద్దేశించి సైటర్లు వేశారు.
వైఎస్ఆర్ బతికుంటే.. కడప జిల్లాకు ఇంకా ఎంతో చేసేవారని తెలిపారు. వైఎస్ఆర్ బతికుంటే కడపకు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేదన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏపీ విభజన హామీల్లో ఒకటని గుర్తు చేశారు. కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా జగన్ తెచ్చుకోలేకపోయారని షర్మిల విమర్శలు గుప్పించారు.
జగన్ సీఎం పదవి చేపట్టాక మారిపోయారని షర్మిల అన్నారు. గతంలో వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే.. ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎప్పుడూ పదవీ కాంక్ష లేదన్నారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు.
వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తనపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీతో తన భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని ఆరోపిస్తున్నారన్నారు. జగన్ను జైల్లో పెట్టి తాను సీఎం కావాలని బ్రదర్ అనిల్ కోరారని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అదంతా అబద్ధమన్నారు.
సోనియా గాంధీ దగ్గరికి భారతి రెడ్డితో కలిసే బ్రదర్ అనిల్ వెళ్లేవారని షర్మిల స్పష్టంచేశారు. వైసీపీ నేతలు ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ పత్రికలో తనపై వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఆ పత్రికలో జగన్కు ఎంత భాగస్వామ్యం ఉందో తనకు అంతే ఉందని స్పష్టంచేశారు. ఆ విషయం మరిచి ఆ పత్రికలో ఇష్టానుసారం వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు.