YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. ఒక వైపు చంద్రబాబు మళ్లీ ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. అటు ఆయన తనయుడు నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
సీఎం జగన్ ఎన్నికల కోసం చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొంతమంది రీజనల్ కోఆర్డినేటర్లను, జిల్లా అధ్యక్షులను మార్చేశారు. ఇప్పుడు నియోజవర్గాల ఇన్ ఛార్జ్ లపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆ పార్టీలో ఇదే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేల్లో పనితీరు బాగాలేనివారిని పక్కన పెట్టేయాలని భావిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం ఖాయమని తెలుస్తోంది. సర్వేల్లో ప్రతికూల ఫలితాలున్నవారికి షాక్ తప్పదంట. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.
పార్టీ సొంతంగా సర్వే చేసింది. ఐప్యాక్ అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేసింది. వాటి ఫలితాల ఆధారంగానే టికెట్లు ఇవ్వాలన్నదే జగన్ అభిమతమట. సరిగ్గా ఇదే సమయంలో నియోజకవర్గాలకు పార్టీ పర్యవేక్షకుల నియామకంపై సీఎం సమీక్షిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. పనితీరు మెరుగుపరచుకోకపోతే మీ స్థానంలో కొత్త ఇన్ఛార్జులను నియమిస్తానని సీఎం జగన్ సెప్టెంబర్ లోనే ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. చెప్పినట్టే వారిని మార్చేశారు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరును సీఎం వైఎస్ జగన్ అంచనా వేశారు. సెప్టెంబర్ 28న నిర్వహించిన సమీక్షలో అప్పటివరకు గ్రామాలకు వెళ్లని 27 మంది పేర్లను వెల్లడించారు. మిగిలినవారి పనితీరుపైనా నివేదికలు తెప్పిస్తున్నామని వెల్లడించారు. ఒక్కో ఎమ్మెల్యేను ఇద్దరేసి ఐప్యాక్ ప్రతినిధులు పరిశీలించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్ నివేదికలతోపాటు, ప్రైవేట్ సంస్థలతోనూ సర్వేలు చేయించి ఆ నివేదికల ఆధారంగా వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం అంచనా వేసిందంటున్నారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలతో సీఎం ఈ వ్యవహారాలపై చర్చించినట్లు తెలిసింది.
175 నియోజకవర్గాలకు 175 మంది పర్యవేక్షకుల జాబితాను గత నెలలోనే సిద్ధం చేశారు సీఎం జగన్. కానీ, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వీరి నియామకం ఉండాలని భావించారు. త్వరలో పర్యవేక్షకులను ప్రకటిస్తారు. దీంతో ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైందని తెలుస్తోంది. ఏదిఏమైనా సీఎం జగన్ తనదైన రాజకీయ వ్యూహాలతో సొంతపార్టీ నేతలనే కాదు.. ప్రత్యర్థి పార్టీల్లోనూ టెన్షన్ పుట్టిస్తున్నారు.