YS Jagan Master Plan Reverse in Tirupati Laddu Issue: తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలోనే ఇలా జరగడం ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురిచేస్తుంది. అందరూ గత వైసీపీ సర్కారు నిర్వాకంపై మండి పడుతున్నారు. దాంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి తిరుమల పర్యటన అంటూ హడావుడి చేసిన జగన్.. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. అసలు ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్ధితుల్లో జగన్ స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకోవడం వెనుక ఆంతర్యమేంటి? కొండెక్కడానికి ఎందుకు రెడీ అయ్యారు? అంతలోనే ఎందుకు డ్రాప్ అయ్యారు?
వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యితోపాటు.. ఇతర విభాగాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల వెల్లువెత్తుతున్నాయి. వీటిపై టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఘోరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందువులు, హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూ కల్తీ ఘటనపై సిట్ విచారణకు ఆదేశించారు. మరో వైపు తిరుమలలో లడ్డూ కల్తీపై అర్చకులు సంప్రోక్షణ యాగం నిర్వహించారు.
అదలా ఉంటే జగన్ సహా ఆపార్టీ నేతలు లడ్డూలో కల్తీనెయ్యి కలిసిందన్న విషయాన్ని ఒప్పుకోవటం లేదు. కేంద్రం గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చినా అవన్నీ అబద్దపు రిపోర్టులు, తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చిన రిపోర్టులంటూ జగన్ సహా ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ క్రమంలలడ్డూ వివాదాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించాలని చూసిన వైసీపీ ప్లాన్ బూమరాంగ్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయన తిరుమల యాత్ర రద్దు చేసుకోవడం, తిరుమల దేవుడిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే అని తేలిపోయింది.
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని ల్యాబ్ రిపోర్టులు రావడంతో జగన్ మోహన్ రెడ్డితోపాటు వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టింది. ఆ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు. తిరుమలకు ఒక రోజు ముందే వెళ్లేందుకు షెడ్యూల్ సైతం రెడీ చేసుకున్నారు. తిరుపతి వెళ్లే క్రమంలో పోలీసులు జగన్ను అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఘర్షణలకు దిగేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయన్న ప్రచారం జరిగింది. రాయలసీమలోని పలువురు ముఖ్యనేతలకు ఈ మేరకు స్వయంగా వైసీపీ పెద్దలే ఆదేశాలు ఇచ్చారంటున్నారు.
Also Read: డర్టీ పాలిటిక్స్, పోసాని కామెంట్స్ వెనుక..
జగన్ని తిరుమల వెళ్లకుండా అడ్డుకుంటే తిరుపతి ప్రాంతంలో అలజడులు సృష్టించి.. తద్వారా ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యేలా చేయడానికి వైసీప స్కెచ్ గీసిదంటున్నారు. వారి వ్యూహాలను ముందుగానే పసిగట్టిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కూటమి నేతలు ఎవరూ జగన్ ను అడ్డుకోవద్దని, ప్రశాంత వాతావరణంలో జగన్ తిరుమల పర్యటన సాగేలా చూడాలని సూచించారు. ఎందుకైనా మంచిదని ప్రభుత్వం ఆయనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వందల మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేసింది. కాన్వాయ్ కూడా రెడీ చేసింది.
జగన్ పర్యటన సందర్భంగా ఎలా అవాంతరాలు చోటు చేసుకోకుండా తిరుపతి జిల్లాలో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ తన పార్టీ శ్రేణులకు పోలీసులు నోటీసులివ్వడంపై పెద్ద రాద్ధాంతం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని, దేవుడి దగ్గరకు వెళ్లాలనుకుంటే అడ్డుకునే మనస్తత్వం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
వాస్తవానికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో 218మంది వైసీపీ శ్రేణులకు పోలీస్ శాఖ నోటీసులివ్వగా.. 292 మంది కూటమి నేతలు కూడా నోటీసులందుకున్నారు. వీరిలో 154 మంది టీడీపీ నాయకులు, 138 మంది జనసేన నాయకులు ఉన్నారు. తిరుమలకు వచ్చిన తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవీలతకు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ మూల చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా తిరుపతిలోని కూటమి పార్టీల నాయకులంతా గృహ నిర్బంధాలకు గురయ్యేవారు. తిరుపతి టౌన్బ్యాంకు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా వైసీపీ అరెస్ట్ చేయించింది. తిరుపతికి జగన్ వచ్చే ప్రతి పర్యటనలోనూ కూటమి నేతల ఇంటి ముందు పోలీసులు నోటీసులతో ఉండేవాళ్లు. జగన్ తిరుగు ప్రయాణం అయ్యే వరకు అడుగు బయటపెట్టనిచ్చేవారు కాదు.
అయితే ఈ సారి కూటమి ప్రభుత్వం చేసిన ముందస్తు ఏర్పాట్లు, చంద్రబాబు, పవన్కళ్యాణ్లు తమ పార్టీ శ్రేణులను కంట్రోల్లో ఉండాలని హెచ్చరించడం జగన్కు బిగ్ షాకిచ్చిందంట. తనను అడ్డుకుంటే ఆందోళనలకు తెరతీయాలని భావించిన జగన్కు కూటమి ప్రభుత్వ నిర్ణయం మింగుడుపడని అంశంగా మారిందంటున్నారు. అందుకే తన పర్యటనను రద్దు చేసుకున్నారంట.
మొత్తానికి తిరుమలలో పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా చేయాలని భావించిన జగన్ కు అపార రాజకీయ అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తమదైన వ్యూహంతో చెక్ పెట్టి బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక జగన్ తిరమల పర్యటన రద్దు చేసుకోవడంతో ఆయన హిందూ వ్యతిరేకి అనీ, ఆయనకు తిరుమల దేవుని పట్ల విశ్వాసం లేదని తేలిపోయిందని పరిశిలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎఫెక్ట్తో జగన్ రానున్న అయిదేళ్ల కాలంలో తిరుమల వచ్చే అవకాశం లేదని ఆయన గురించి బాగా తెలిసిన వారంటున్నారు.