YS Jagan: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ పార్టీ ఢీలా పడింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని వైసీపీ ఎటూ పాలుపోని స్థితికి పడిపోయింది. అధికార పక్షాన్ని ఎదుర్కోవడం పక్కనపెడితే.. పార్టీని బలంగా నిలుపుకోవడం కష్టంగా మారింది. నాయకుల మధ్య పొరపొచ్చాలు వస్తున్నాయి. కొందరు నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ముందుగా పార్టీలో లుకలుకలను సెట్ చేసే పనిలో ఉన్నట్టు అర్థం అవుతున్నది. అలాగే.. పార్టీ కోసం పని చేసిన వారికీ గుర్తింపు ఉంటుందనే సంకేతాలను ఇవ్వదలిచినట్టు స్పష్టం అవుతున్నది. ఇందులో భాగంగానే యాంకర్ శ్యామలకు వైఎస్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమెను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆమెతోపాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు, ఆర్ కే రోజాలను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ పీఏసీ(వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా) సభ్యుడిగా నియమించారు. అలాగే.. చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా(తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు)కు అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రులు ఆర్ కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ వీరిని ట్రాక్లో పెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరికీ కీలక పదవులు అప్పజెప్పారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ కోసం పని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Also Read: Vijayasai Reddy: ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. అందుకు ప్రధాన కారణం ఎవరో చెబుతూ..
ఇక యాంకర్ శ్యామల వైసీపీ కోసం ఎన్నికల ముందు కష్టపడ్డారు. ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరిగారు. ఆమె వ్యాఖ్యలు టీడీపీ, జనసేన నాయకులను ఇబ్బందులు పెట్టాయి. దీంతో ఆమెను చంపేస్తామనే బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా.. యాంకర్ శ్యామల వెనక్కి తగ్గలేదు. పార్టీ కోసం బలంగా గొంతు వినిపించింది. కానీ, ఎన్నికల్లో వైసీపీ దారుణంగా మట్టికరిచింది. అయినా.. యాంకర్ శ్యామలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగలేవు. తాజాగా, యాంకర్ శ్యామల పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఆమెకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు వచ్చాయి. ఈ నిర్ణయాలు చూస్తే.. వైఎస్ జగన్ తన పార్టీని చక్కబెట్టే పనిలో నిమగ్నమైనట్టు, పార్టీలో నాయకుల మధ్య సఖ్యతను పెంచి పార్టీని పటిష్టం చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా, పార్టీ మారుతున్నారనే అనుమానాలు కలిగిన పార్టీ ఎమ్మెల్యేలను పిలిచి మాజీ సీఎం జగన్ మాట్లాడారు. పార్టీలోనే కొనసాగాలని, పార్టీ కోసం పని చేస్తే తప్పకుండా మంచి ప్రతిఫలం దక్కుతుంది జగన్ పేర్కొన్నారు.