2024 ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో వైసీపీ ఒక వెలుగు వెలిగింది. 34 శాసనసభ స్థానాలు ఉంటే విశాఖ నగరంలోని నాలుగు స్థానాలు, శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాలు తప్ప మిగిలిన 28 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రపై పట్టు నిలుపుకోవడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ ప్రాంతానికి సంబంధం లేని నాయకులను ఇన్చార్జులుగా నియమించి పెత్తనం చేయించారు. 2019 ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డిని, ఎన్నికల్లో గెలిచిన మూడేళ్ల తర్వాత ఆయన్ని మార్చి వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించారు.
అప్పట్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ విజయసాయి, వైవీల పెత్తనమే నడిచింది. జగన్ కంటే ఆ ఇద్దరు నేతల ప్రాపకం కోసమే ఉత్తరాంధ్ర నేతలు పాకులాడే వాళ్ళు.. ఈ ఇద్దరు నాయకుల్లో ఎవరి దయ ఉన్నా సీటు వస్తుంది. గెలిస్తే పదవులు వస్తాయనే నమ్మకం ఎమ్మెల్యేల దగ్గర్నుంచి కిందిస్థాయి నాయకులు వరకు ఉండేది. దీంతో ఈ ఇద్దరు నాయకులు విశాఖలో అడుగు పెడితే చాలు కాళ్లు మొక్కడం దగ్గర నుండి, పెద్దపెద్ద ఫ్లెక్సీలు, భారీ ర్యాలీలతో వాళ్ళ దృష్టిలో పడే ప్రయత్నం చేసేవాళ్లు.
ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో మూడేళ్ల తర్వాత జగన్ విజయసాయిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా తప్పించి వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. వైవీ సుబ్బారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నంత ఉత్తరాంధ్ర సీఎంలా చలాయించారన్న విమర్శలున్నాయి. దాదాపుగా రెండు సంవత్సరాలు ఆ మూడు జిల్లాల్లో ఆయన పెత్తనమే నడిచింది.
ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు ఉన్నా మొన్నటి ఎన్నికల బాధ్యతలను జగన్ పూర్తిగా వైవీ సుబ్బారెడ్డికే అప్పగించారు. దాంతో 2024 ఎన్నికల్లో జగన్ కంటే వైవీ సుబ్బారెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే టికెట్ ఆశావహులు నానా పాట్లు పడ్డాయి.. ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు అనుకుని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఉత్తరాంధ్రలో అభ్యర్ధుల మార్పు విషయంలో వైవి సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే జగన్ కేండెట్ల మార్పులుచేర్పులు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉహించని ఎదురు దెబ్బ తగిలింది .. కేవలం పాడేరు, అరకు స్థానాలకే పరిమితమైంది.
Also Read: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?
అప్పటి నుండి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్దదిక్కు లేకుండా పోయారు. రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి విశాఖ వైపు, మిగిలిన జిల్లాల వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో ప్రతి రెండు రోజులకు ఒకసారి విశాఖకి వచ్చిన వైవీ.. ఇప్పుడు నెలకు ఒకసారి కూడా విశాఖ వైపు చూడక పోతుండటంతో ఉత్తరాంధ్ర కేడర్తో పాటు నేతలు కూడా దిక్కుతోచని స్థితిలో కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్యే ఎన్నికల్లో బొత్స పోటీ చేయడంతో వైవీ సుబ్బారెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో ఒక్కసారి విశాఖ వచ్చి వెళ్లారు
ఆ ఎన్నికల్లో కూటమి పోటీ నుంచి తప్పుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఆ తర్వాత వైవీ అటు వైపు చూడటమే మానేశారు. ఆయనే కాదు ఉత్తరాంధ్ర వైసీపీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శీను.. ఇలా ఎవరూ పార్టీ కార్యకలాపాల్లో కనిపించక పోతుండటంతో కేడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమితులైన బొత్స, మాజీ మంత్రి గుడివాడలు మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తూ.. ఉన్నామంటే ఉన్నాం. అనిపించుకుంటున్నారు.
ప్రభుత్వం వైసీపీపై చేస్తున్న విమర్హలపై బొత్స, గుడివాడ తప్ప ఎవరు స్పందించకపోతుండటంతో.. అసలే ఢీలా పడిపోయిన కేడర్లో మరింత నైరాశ్యం కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధర్లో ఓ వెలుగు వెలిగింది వైసీపీ. దాని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉందని జగన్ పలుసందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కార్యకర్తలను, స్థానిక నేతలను పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతుంది. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన వై వి సుబ్బారెడ్డి లాంటి నాయకుడు కూడా విశాఖ వైపు కన్నెత్తి చూడకపోవడం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తుంది.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలను టిడిపి గెలిచింది. కొంతమంది కార్పొరేటర్లను టీడీపీ, జనసేనల వైపు తిప్పుకొని మేయర్ పదవిని కూడా చేజిక్కించుకోవడానికి పావులు కదుపుతుంది. మరోవైపు జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ కీలక నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. అయినా పార్టీ పెద్దలు స్పందించడం లేదు. వారికి భరోసా ఇచ్చి పార్టీలో కొనసాగేలాగా చేయలేకపోతున్నారు. దాంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీకి దిక్కెవరు అనే చర్చ మొదలైంది.
వైవీ సుబ్బారెడ్డి తన రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి మరో నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని.. లేకపోతే ఆయనే ఉత్తరాంధ్రలో యాక్టివ్ అవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకపోతే పార్టీ ఉనికి కాపాడుకోవడం కూడా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.