Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి శుక్రవారం మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్లోని తమ కార్యాలయానికి రావాలని ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది.
ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వెకేషన్ బెంచ్కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ తేదీ ఖరారులేదు. దీంతో అవినాష్రెడ్డికి దారులు మూసుకుపోయాయని న్యాయనిపుణులు అంటున్నారు.
సీబీఐ విచారణకు పిలిచిన ప్రతిసారీ అవినాష్రెడ్డి కోర్టులో పిటిషన్ వేస్తున్నారని, గడువు కోరుతూ విచారణను జాప్యం చేస్తున్నారని వివేకా కుమార్తె సునీతారెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది. మరోవైపు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్కు ఎంపీ అనుచరులు భారీగా తరలివచ్చారు. మొత్తం మీద శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఆ రోజు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. పులివెందులకు వెళ్లిపోయారు. విచారణకు హాజరయ్యేందుకు 4 రోజుల గడువు కావాలని సీబీఐకి లేఖ రాశారు. అదే రోజు సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తప్పకుండా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. జూన్ 30 లోపు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.