Yemmiganuru YCP : ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అధిష్టానం సీట్ల మార్పుల చేర్పుల వ్యవహారం గందరగోళానికి కారణమవుతోంది.. ముఖ్యంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఉన్న చెన్న కేశవరెడ్డిని కాదని .. కొత్తగా మాచాని వెంకటేష్ అనే కొత్త ఇన్చార్జ్ను ప్రకటించింది.. అయితే ఆయనకు స్థానికంగా అంత సీన్ లేదని తేలడంతో .. ఇప్పుడు సామాజికవర్గ లెక్కలతో మాజీ ఎంపీ బుట్టా రేణుకను తీసుకొచ్చే పనిలో పడ్డారంట వైసీపీ పెద్దలు.. చేనేతపురిగా పేరుగాంచిన ఎమ్మిగనూరులో అదే వర్గానికి చెందిన బుట్టా రేణుక అయితే ఈజీగా నెగ్గుకొస్తారని పార్టీ భావిస్తోందంట.. మరి చేనేతల ఓట్లు గంపగుత్తుగా రేణుక బుట్టలో పడతాయా?.. వరుసగా ఇన్చార్జ్ల మార్పు ఎటు నుంచి ఎటు దారితీస్తుంది?
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మిగనూరు పంచాయతీ సద్దుమణిగిందని అనుకునేలోపే.. మరోసారి రచ్చకెక్కింది. ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డిని కాదని.. ఎమ్మిగనూరు ఇన్చార్జిగా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించింది వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు ఆయన్నీ తప్పించబోతున్నారంట.. వైసీపీ క్యాడర్ లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచాని పై సర్వే చేయించారు వైసీపీ పెద్దలు.. సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆయన స్థానంలో బుట్టా రేణుకను నియమించనున్నట్లు తెలుస్తోంది .. ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అంగీకారంతో బుట్టా రేణుక నియామకం జరుగనుందని అంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేత పూరిగా పేరుగాంచిన ఎమ్మిగనూరు సెగ్మెంట్ వైసీపీ టికెట్ రేసులో కొత్తకొత్త కేండెట్లు ప్రత్యక్షమవుతున్నారు.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయాభారం కారణంగా.. తన సీటు తన కుమారుడు జగన్మోహన్రెడ్డికి ఇవ్వాలని కోరుకున్నప్పటికీ .. అది వర్కౌట్ కాలేదు .. స్థానిక నేతలు పలువరు ఆయన నియోజకవర్గానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని.. ఆయన కొడుక్కే టికెట్ ఇవ్వాలని కోరినా వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. దాంతో మాచాని వెంకటేష్ను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించిన వెంటనే జడ్పీటీసీలు, ఎంపీపీలు ముక్కుమ్మడిగా మీటింగు పెట్టుకుని రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు.. దాంతో చెన్నకేశవరెడ్డి అధిష్టానంతో మరోసారి మాట్లాడుతానంటూ వారిని సముదాయించారు.
ఎమ్మిగనూరు నుంచి కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్న వైసీపీ. చెన్నకేశవరెడ్డి సూచించిన అభ్యర్ధికే టికెట్ ఇస్తామని ప్రపోజల్ పెట్టింది.. ఎలాగూ తన కొడుకు జగన్మోహన్రెడ్డికి టికెట్ నిరాకరించడంతో .. చెన్నకేశవరెడ్డి తనకు సన్నిహితంగా ఉండే మాచాని వెంకటేష్ పేరును ప్రపోజ్ చేశారు. స్థానికంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక, సంజీవ్ కుమార్, రుద్రగౌడ లాంటి నాయకులు ఉన్నప్పటికీ వెంకటేష్ పేరును సూచించారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని వైసీపీ మూడో జాబితాలో ప్రకటించింది .. దాంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి .
ఎమ్మిగనూరు సెగ్మెంట్లో ఖచ్చితంగా అభ్యర్ధిని మార్చాలని వస్తున్న వ్యతిరేకతతో.. వైసీపీ పెద్దలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ఖరారు చేశారంట .. అయిదో జాబితాలో ఆమె పేరు ప్రకటించడమే ఆలస్యమంటున్నారు .. అయితే చెన్నకేశవరెడ్డి, రేణుక వర్గాలకు అసలు పొసగదు.. మాజీ ఎంపీని ఇప్పటి దాకా శత్రువులా చూస్తున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆమెకు ఎంత వరకు సహరిస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.. గతంలో పార్టీ అధిష్టానం అడిగినప్పుడే.. తాను సూచించిన వ్యక్తికి టికెట్ ఇస్తేనే సపోర్ట్ చేస్తానని.. లేదంటే సహకరించే ప్రసక్తే లేదని .. పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పారట చెన్నకేశవరెడ్డి.. పార్టీ అధిష్టానం కూడా ఆ సీనియర్ నాయకుడు చెప్పిన మాటలకు కట్టుబడి ఆయన సూచించిన వెంకటేష్కే సీటు కేటాయించింది.
అయితే వెంకటేష్ పేరు ప్రకటించిన నాటి నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గం వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి .. దాంతో మరొకసారి సర్వే చేయించిన వైసీపీ .. ఆ సర్వే నివేదిక బుట్టా రేణుకకు అనుకూలంగా ఉండటంతో .. ఆమె వైపు మొగ్గు చూపిందంట .. చేనేత సామాజికవర్గానికి చెందిన ఆమెకు ఎమ్మిగనూరులో నిర్ణయాత్మకంగా ఉన్న ఆ వర్గం ఓటర్లు ఆదరిస్తారన్నది పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది..
అయితే రేణుకకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితి లేదంటున్నారు.. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ రుద్ర గౌడ, వెంకటేష్లు మనస్ఫూరిగా సపోర్ట్ చేసే అవకాశం కనిపించడం లేదు .. అలా స్థానిక ముఖ్యనేతలంతా.. ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తే.. ఎన్నికల సమయానికి రేణుక ఏం చేస్తారు?.. అమెకు చేనేతపురి ఓటర్ల ఆదరణ ఏ మేరకు లభిస్తోందో? అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది.. అదే వర్గానికి చెందిన వెంకటేష్కు ఆశలు కల్పించి పక్కనపెట్టేసింది వైసీపీ.. మరోవైపు బలమైన నాయకుడు రుద్రగౌడ టికెట్ కోసం ప్రయత్నించినా .. ఆయన పేరు అసలు పరిగణలోకే తీసుకోలేదు.. దాంతో వారి వర్గీయుల్లో అసంతృప్తి రగులుతోందంట.
పార్టీ అధిష్టానం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డ, మాజీ ఎంపీ బుట్టా రేణుకలను పిలిపించుకుని .. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించిదంట.. బుట్ట రేణుక వర్సెస్ చెన్నకేశవరెడ్డి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి.. ఆవిభేదాలను మనసులో పెట్టుకోవద్దని అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.
మరి బుట్టా రేణుక పేరు అధికారికంగా ప్రకటిస్తే .. ఎమ్మెల్యే వర్గీయులు సహకరించడం ఏమోకాని .. మళ్లీ ఎమ్మెల్యే కొడుకు జగన్మోహన్రెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు మొదలుపెట్టడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది .. మొత్తానికైతే ఎమ్మిగనూరు ఎపిసోడ్తో ఇప్పటికే పలు సెగ్మెంట్లలో ఇన్చార్జులుగా ప్రకటించిన నేతలకు డౌట్లు మొదలయ్యాయంటున్నారు. ఎన్నికల నాటికి తాము అభ్యర్ధులుగా ఉంటామా? లేదా ఎమ్మిగనూరు తరహాలో మార్చేస్తారా? అని తెగ టెన్షన్ పడిపోతున్నారంట