YCP Third List : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా వచ్చింది. 21 మందితో వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా వైసీపీ ఇంఛార్జుల మూడో జాబితాను విడుదల చేశారు. మూడో జాబితాను నిన్ననే ప్రకటించాల్సి ఉండగా.. కొందరి విషయంలో స్పష్టత రాకపోవటంతో ఈరోజుకు వాయిదా పడింది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. సీఎం జగన్తో భేటీ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సుదీర్ఘంగా చర్చించి.. జాబితాను ఫైనల్ చేశారు. ఈ జాబితాలో 21 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇంఛార్జులను ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోనూ పలువురికి ఇంఛార్జులుగా అవకాశం కల్పించారు వైఎస్ జగన్.
తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కోణేటి ఆదిమూలం, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ,ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్లను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.
రాయదుర్గం అసెంబ్లీ అభ్యర్థిగా మెట్టు గోవింద రెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు నుంచి మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, ఆలూరు నుంచి బూసినే విరూపాక్షి, కోడుమూరు నుంచి డా. సతీష్, గూడూరు నుంచి మేరిగ మురళి, సత్యవేడు నుంచి మద్దిల గురుమూర్తి, పెనమలూరు నుంచి జోగి రమేష్, పెడన నుంచి ఉప్పాల రామును బరిలోకి దించనుంది వైసీపీ అధిష్టానం. జోగి రమేష్ను పెడన నుంచి పెనమలూరుకు మార్పు చేసింది. తిరుపతి ఎంపీ స్థానం నుంచి సత్యవేడుకు గురుమూర్తిని కూడా మార్పు చేసింది. ఇక వైసీపీ కండువా కప్పుకోకున్నా కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం.