YCP Rebel MLA’s : ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై రచ్చ రాజుకుంటోంది. మొన్నటికి మొన్న మూడేళ్ల క్రితమే రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామాను ఉన్నట్టుండి స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆమోదించారు. దానికి కొనసాగింపుగా వైసీపీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నోటీసులు జారీ చేశారు. ఐతే తమకు ఇచ్చిన నోటీసులపై స్పీకర్ కు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తిరిగి లేఖలు రాశారు.
తమకు ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కావాలని ఆ నలుగురు ఎమ్మెల్యేలు కోరారు. న్యాయ సూత్రాల ప్రకారం సమాధానం ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నోటీసుతోపాటు పంపిన పేపర్,వీడియో క్లిప్పింగులు అసలైనవో..మార్ఫింగ్ చేసినవో నిర్ధారించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా తమపై ఫిర్యాదు చేసిన వాళ్లు ఇచ్చిన ఆధారాల ఒరిజనల్స్ తమకు ఇవ్వాలని లేఖలో కోరారు. సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధించిన ఐపీ అడ్రస్ లు ఇవ్వాలన్నారు.
ఏపీలో త్వరలో 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సీట్లను కైవసం చేసుకునేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. 3 స్థానాలకు చేజిక్కించుకునేందుకు తగిన ఎమ్మెల్యేల బలం ఉన్నా.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 3 ఏళ్ల క్రితం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే ఇప్పుడు స్పీకర్ ఆమోదం తెలిపారు. అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని నేతలు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ అవకాశం ఉపయోగించుకునేందుకు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీ పెడుతుందని తెలుస్తోంది.