టీడీపీ, జనసేన పొత్తుల వ్యవహారంపై వైసీపీ ఘాటుగా స్పందించింది. ప్యాకేజ్ బంధం బయటపడిందని ట్వీట్ చేసింది. పవన్ రాజమండ్రి సెంట్రల్ జైల్కి వెళ్లింది ఇందు కోసమేనా? అని ప్రశ్నించింది. ఇన్నాళ్లూ నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నమ్మిన వాళ్లకు భ్రమలు తొలగించేశావని కౌంటర్ వేసింది.
పొత్తులకు, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధంగా పేర్కొంది. ఇక టీడీపీ, జనసేనను మూకుమ్మడిగా రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మండిపడింది. జైల్లోనూ పాలిట్రిక్స్ వదిలి పెట్టరా అంటూ పవన్, చంద్రబాబులకు చురకలు అంటించింది.
పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన దాచిపెట్టుకోకుండానే ఇంతకాలం రాజకీయాలు చేశారు. 2014లో చంద్రబాబు కోసం కలిసి పోటీ చేశారని .. 2019 ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికి విడివిడిగా పోటీ చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కలిశామంటున్నారని కానీ అసలు విడిపోయిందెప్పుడు? అని ప్రశ్నించారు.
అధికార పార్టీకి ఇప్పుడు ఉన్నవిధంగా ఎప్పుడూ ఈస్థాయిలో మద్దతు లేదని సజ్జల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 60 శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేశారు.ప్రజల మద్దతుపై ఎంతో నమ్మకంతో ఈ మాట చెప్తున్నామని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామన్నారు. పవన్ మేకపోతు గాంభీర్యం మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. పవన్ పొలిటీషియన్ అయితే బాధ్యతగా మాట్లాడేవారని అన్నారు. సినిమాల్లో డైలాగులు వేసినట్లు బయట వేస్తే జనం నవ్వుతారన్నారు. రియాలిటీకి జనం దగ్గరగా ఉన్నారని.. రీల్కి దగ్గరగా పవన్ ఉన్నారని సజ్జల సెటర్లువేశారు.
పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లాడా? బేరం మాట్లాడ్డానికి వెళ్లాడా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబుతో ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలిందన్నారు.బీజేపీతో పవన్ ది తాత్కాలిక పొత్తు మాత్రమేనన్నారు.తెలుగుదేశంతోనే పవన్ కు శాశ్వత పొత్తు అని సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ అంతర్భాగమని స్పష్టం చేశారు.
కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమేనని పేర్ని నాని విమర్శించారు. పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి డీల్ చేసుకుని వచ్చారని విమర్శించారు. లోకేష్ తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా? అని నిలదీశారు. సినిమాల్లోనే పవన్ హీరో… బయట మాత్రం జోకర్ అని 25 స్థానాలకు అభ్యర్ధులను సప్లై చేస్తాడన్నారు.