ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్న సీఎం జగన్.. ఇక ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. సిద్దం పేరుతో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖరావం పూరించనున్నారు. విశాఖ జిల్లా తగరపువలసలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు 3 లక్షల మంది కార్యకర్తలు వచ్చేలా వైసీపీ జనసమీకరణ చేసింది.
ఎన్నికలకు సెంటిమెంట్గా ఉత్తరాంధ్రలో మొదటి సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఎన్నికలకు ఎలా సిద్దం కావాలో సిద్ధం సభలో కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలలో ప్రజలను ఎలా భాగస్వాములను చేయాలో కార్యకర్తలకు సీఎం జగన్ వివరిస్తారు. ప్రతి కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును గుర్తు చేసి ఓటు వేయించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు.
రాజధాని అంశంపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధానిగా విశాఖ కాకుండా విపక్షాలు అడ్డుకున్నాయని.. ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన వివరిస్తారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే.. విశాఖ రాజధాని అవుతుందని ఈ సభలో జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. విశాఖ పాలనా రాజధాని అయితే.. ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతుందో కూడా కార్యకర్తలకు వివరిస్తారు. దీంతో.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.