kondeti chitti babu joins congress(AP political news): అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా వైసీపీపై అసంతృప్తితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా సీఎం జగన్ కు వెన్ను చూపిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం విడుదల చేసిన పలు జాబితాల్లో సీటు రాని అభ్యర్థులంతా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.
పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని ముద్దనూరులో వైఎస్ షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిట్టిబాబును పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈరోజు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ కు వైసీపీ టికెట్ కేటాయించారు. దీంతో ఆయన అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చివరికి పార్టీని వీడారు.