Narasaraopet: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికార పార్టీ నేతలపై వ్యతిరేకత సీఎం జగన్ కి తలనొప్పిగా మారింది. ఇప్పటికే వైసీపీలో మార్పులు, చేర్పులు నేతలను టెన్షన్ పెడుతుండగా.. పలు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ముద్దు.. మా ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళనకు దిగుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నేతలు ఆందోళనకు దిగారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద నరసరావుపేట నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. గోపిరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లు ప్రదర్శించారు. జగన్ ముద్దు..గోపిరెడ్డి వద్దు అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్లీజ్ సేవ్ నరసరావుపేట అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోసారి అతనికి టికెట్ ఇస్తే అతని ఓడిస్తామంటూ హెచ్చరించారు.
మరోవైపు.. నరసరావుపేట YSRCP కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో అసమ్మతి వర్గంలోని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పమిడిపాడుకి చెందిన సయ్యద్ హుసేన్.. తన రేషన్ డీలర్షిప్ను తొలగించి.. మరొకరికి ఇచ్చారంటూ నినాదాలు చేశారు. ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్న తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ కార్యాలయంలో వివాదం వద్దంటూ పలువురు కార్యకర్తలు.. అతన్ని బయటకి పంపించారు.
అటు గురజాల నియోజకవర్గంలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టిక్కెట్ కోసం యత్నాలు చేస్తున్నారు. గురజాలకు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తనకే కేటాయించాలని జంగా అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాచేపల్లిలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఆయన ఏర్పాటుచేశారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సమావేశం క్యాన్సిల్ చేసి తాడేపల్లి వెళ్లిపోయారు జంగా కృష్ణమూర్తి. ఇలా ఎక్కడికక్కడ వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం రచ్చ నడుస్తోంది.