YCP Leaders confused | సిట్టింగులు, ఇన్చార్జుల మార్పులు చేర్పుల వ్యవహారం అధికార వైసీపీలో చిచ్చు పెట్టింది. ఆ అసంతృప్తి మంటలు చిలికి చిలికి గాలి వానలా మారి.. పార్టీ ఓటమికి దారితీస్తుందా.. లేక టార్గెట్ వన్ సెవెంటీఫైవ్ రీచ్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
YCP Leaders confused | సిట్టింగులు, ఇన్చార్జుల మార్పులు చేర్పుల వ్యవహారం అధికార వైసీపీలో చిచ్చు పెట్టింది. ఆ అసంతృప్తి మంటలు చిలికి చిలికి గాలి వానలా మారి.. పార్టీ ఓటమికి దారితీస్తుందా.. లేక టార్గెట్ వన్ సెవెంటీఫైవ్ రీచ్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీ అధ్యక్షుడు జగన్పేనే సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ధిక్కార స్వరం వినిపించడం దేనికి సంకేతం. ఇన్నాళ్లూ స్వామిభక్తి చూపించిన నేతలే ఇప్పుడు నీకో దండం సామీ అంటున్నారు. మరి ఇది రేపు విడుదల అయ్యే థర్డ్ లిస్ట్తో ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఎన్నికల నోటిఫికేషన్ కాదు కదా.. షెడ్యూల్ కూడా రానేలేదు. కానీ ఈలోగానే ఎన్నికల టైంలో ఎలాంటి హడావిడి జరగాలో అంతకంటే ఎక్కువే జరుగుతోంది ఏపీలో. అందుకు కారణం అధికార పార్టీ అధినాయకుడి తీరు అని చెప్పాలి. రెండోసారి అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. దాన్ని.. ఆరు నెలల ముందు నుంచే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు.
అందులోభాగంగానే ఎడా పెడా అభ్యర్థులను మార్చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరొక చోటికి మారుస్తున్నారు. కొందరికి టిక్కెట్లను కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుతున్న సర్వేల ప్రకారం అభ్యర్థులను మార్చేసి జగన్ రెండోసారి గెలవాలని భావిస్తున్నారు. అందుకోసం ఎవరినీ లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే కొందరి మనసులు నోచ్చుకుంటున్నాయి. తాము హర్ట్ అయ్యామని చెప్పకనే చెబుతున్నారు. ఇన్ని రోజులు జగనన్న ఎలా చెబితే అలా.. ఇప్పుడు అన్న అయినా అలా చెబితే కుదరదు అంటున్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ అందరికీ ముందుగానే చెప్పారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్నాం. అందుకే రాజకీయంగా ప్రత్యర్థులపై పై చేయి సాధించాలని భావిస్తున్నారు. అయితే గెలవాలంటే అభ్యర్థులను మారిస్తేనే సాధ్యమా? అన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతోంది. అందుకే టికెట్ దక్కనివారు.. దక్కదనుకున్న వారు కూడా అధినేతపై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు.
ఇన్నాళ్లూ పార్టీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామంటూ కొత్తరాగాలు బయటకు తీస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి శింగనమల ఎమ్మెల్యే పద్మావతి వచ్చి చేరారు. దళిత ఎమ్మెల్యే అయిన తననుదుకు చిన్నచూపు చూస్తున్నారని నిరసన గళం వినిపించారు. ఫేస్బుక్ వేదికగా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి….వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో సాగునీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వైసీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి పంచాయితీ చేరింది. MLC రఘురాజు, MLA కడుబండి వర్గాల మధ్య కొన్నాళ్లుగా పచ్చగండి వేయకుండానే భగ్గు మంటోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని, పార్టీకి తీరని నష్టం కలుగుతుందని ఎమ్మెల్సీ రఘురాజు వర్గం అంటోంది. అటు.. వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ నెక్కల నాయుడుబాబు కూడా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు.
శృంగవరపు కోట పంచాయితీలో తలదూర్చేందుకు మంత్రి బొత్స ఇష్టపడలేదు. దీంతో ఆయన భార్య ఝాన్సీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ వర్గీయులు. పార్టీ అధిష్టానం అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తుందని బొత్స ఝాన్సీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే టికెట్ వస్తుందా? రాదా? పార్టీలో ఉండాలా? వేరే దారి వెతుక్కోవాలా? చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఈ చర్చ జరుగుతోంది. శృంగవరపు కోటలోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వొద్దంటూ ఓవైపు అసమ్మతి వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుంటే.. తానే బరిలో ఉంటానని ఎమ్మెల్యే చెప్తున్నారు.
ఇన్నిరోజులు పార్టీ అధినేత ఏం చెబితే అది చేసిన వాళ్లు ఇప్పుడు సడెన్గా ఎందుకు తమ స్వరం మారుస్తున్నారు. పార్టీ టికెట్ రాదని ముందుగానే గ్రహించి కొందరు విమర్శలు చేసేవారైతే.. మరికొందరు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లివచ్చాకే జగన్ పై విమర్శలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది.
ఇదే కోవకు వస్తారు పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు. ఈయన కూడా వైసీపీలో కేవలం దళితుల సీట్లు మారుస్తున్నారని.. అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఓసీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, వారిని ఎందుకు మార్చడం లేదని జగన్ను ప్రశ్నించారు. 2019లో సర్వే రిపోర్టు ఆధారంగా కాకుండా డబ్బు ఆధారంగానే సీట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు కూడా చేశాడు.
జగన్ వరుసగా ఎమ్మెల్యేలను మారుస్తూ కొందరికి సీట్లు ఇవ్వకపోతుండటంతో అందరి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇందులో జగన్ ఏ మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని చెబుతున్నారు. అందుకే ముందుగానే ఎమ్మెల్యేలను పిలిపించి తాను ఎందుకు టిక్కెట్లు ఇవ్వలేకపోతున్న విషయం చెబుతున్నారు. అయితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మరో కీలకమైన పదవి ఇస్తామని భరోసా ఇస్తున్నారు. మరికొందరికి ఎమ్మెల్సీ పోస్టులను ఆఫర్ చేస్తున్నారు. అయినప్పటికీ మార్చిన నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్థులకు సహకరిస్తారన్న గ్యారంటీ లేదు. తమ నియోజకవర్గంలో వేరే వారు గెలిచేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు? అందుకే తమ దారి తాము… చూసుకుంటున్నారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ఈసారి టిక్కెట్ ఇవ్వలేమని చెప్పడంతో ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే ఆయన జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది. ఇక రీసెంట్గా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదని చెప్పడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశేశారు. తనను నమ్మించి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి.. గెలిచి చూపిస్తామని జగన్కు సవాల్ విసిరారు.
వాస్తవానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహిత నేత. జగన్తో మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యే. 2009లో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి … ఆ తర్వాత జగన్ కోసం నిలబడ్డ అతికొద్ది మంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. జగన్కు అత్యంత ఆప్తుడైన గాలి జనార్ధన్ రెడ్డికి ఒకప్పుడు కాపు రామచంద్రారెడ్డి వ్యాపార భాగస్వామి కూడా. అయితే ఇటీవల కాలంలో కాపు రామచంద్రారెడ్డికి గాలి జనార్ధన్ రెడ్డితో విభేదాలు, వివాదాలు తలెత్తాయని ప్రచారం ఉంది. ఆ ఎఫెక్టే ఇప్పుడు రామచంద్రారెడ్డి మీద పడిందని వినికిడి.
ఇప్పటికే వైసీపీలో అరకు పంచాయితీ జోరుగా నడుస్తోంది. అరకు ఎంపీగా ఉన్న మాధవికి అరకు అసెంబ్లీ ఇంచార్జ్ ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ మాధవికి అసెంబ్లీ సీటు ఇవ్వద్దంటూ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డికి దగ్గర పంచాయితీ పెట్టారు. స్థానికులకే సీటు ఇవ్వాలని నియోజకవర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ నాయకులకు ఎవ్వరికి సీటు ఇచ్చినా గెలిపిస్తామంటున్నారు. వైవీ సుబ్బారెడ్డితో పంచాయితీ తెగకపోవడంతో మంత్రి బొత్సను కలిశారు. తమ గోడును జగన్కు వినిపించాలంటున్నారు. లేనిపక్షంలో పార్టీలోనే ఉంటూ.. అభ్యర్థిని దారుణంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.
వాస్తవారిని వైసీపీలో గాజువాక నియోజకవర్గంతో ఈ ప్రళయం మొదలైందని చెప్పుకోవాలి. రామచంద్రరావును ఆ నియోజకవర్గ ఇంచార్జ్గా ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి వారితో మాట్లాడితే తండ్రి కాస్త మెత్తబడ్డప్పటికీ దేవన్ రెడ్డి మాత్రం తగ్గేదేలే అన్నాడు. అటు వైజాగ్ ఈస్ట్లో ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కు టికెట్ ఇవ్వొద్దని బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ రావు వర్గం డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా పార్టీని వీడి జనసేనలో చేరిపోయాడు.
మొత్తంగా నేతలు వెళ్లిపోయినా సరే జగన్ మాత్రం అనుకున్న పద్థతిలోనే వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి బలంగా ఉండటంతో గెలుపు గుర్రాలనే నిలపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తనకు అందిన సర్వే నివేదికలను అనుసరించి కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు. వారికి వేరే దారి లేకపోవడంతో ఇక జగన్ చెప్పినట్లే వినాల్సిన పరిస్థితులు అత్యధిక మందిలో ఉన్నాయి. మరికొందరు మాత్రం నువ్వు కాకపోతే ఏంటి అనే స్థితికి చేరుకున్నారు. ఇన్నిరోజులు జగన్ మాటను జవధాటని వీరంతా ఇప్పుడు ఎందుకు అంతలా రెచ్చిపోతున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అంటే ఒకరకంగా జగన్ ఈ ఎన్నికల్లో గెలవలేరని వారు గ్రహించారా.. లేక టికెట్ దక్కలేదనే కోపంతోనే రెబల్స్గా మారుతున్నారా అనేది భవిష్యత్లో తెలుస్తుంది.