SAJJALA RAMAKRISHNA REDDY : వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు విచారించారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో ఆయన విచారణకు హాజరయ్యారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను పోలీసులు విచారించారు. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు జారీ చేయడంతో ఠాణాకు వచ్చారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు సైతం సజ్జల వెంట స్టేషన్ వద్దకు రాగా, తనను కూడా లోనికి అనుమతించాలని పొన్నవోలు అడిగారు. కేవలం సజ్జలకు మాత్రమే అనుమతి ఉందని, మిగతా వారు వెళ్లేందుకు కుదరదని చెప్పడంతో, పొన్నవోలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విచారణ సమయంలో న్యాయవాదులను అనుమతించట్లేదని, ఇందుకు కోర్టు అనుమతి తప్పనిసరి కావాలని సూచించారు.
ప్రస్తుతానికి సజ్జలకు మాత్రమే విచారణ అధికారి వద్దకు వెళ్లేందుకు అనుమతులున్నాయన్నారు. ఫలితంగా సజ్జల మాత్రమే లోపలకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు సజ్జలను విచారించి పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
కావాలనే టార్గెట్ చేస్తున్నారు…
ఇక విచారణ అనంతరం బయటకు వచ్చిన సజ్జల, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కావాలనే తమ పార్టీ నేతలను పోలీసులు వేధిస్తున్నారన్నారు.
సజ్జల విదేశాలకు వెళ్లకూడదు :
వైఎస్ జగన్ హయాంలో 2021 అక్టోబర్ 19న వైసీపీ కార్యకర్తలతో పాటు పలువురు నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సజ్జల ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన దేశం దాటి పోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్లను ఇప్పటికే పలుమార్లు విచారించారు.
సీఐడీకి అప్పగించిన సర్కారు…
కూటమి సర్కారు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ కేసును సీసీఎస్ పోలీసుల నుంచి సీఐడీకి అప్పగించారు. దీంతో మంగళగిరి పోలీసులతో కలిసి సీఐడీ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. ఈ కేేసులో సజ్జల రామకృష్ణారెడ్డి 120వ నిందితుడిగా ఉన్నట్లు చెబుతున్నారు. నిందితుల జాబితాలో పలు పేర్లు రిపీట్ అయ్యాయన్న పోలీసులు, అందులోని అసలు నిందితులను నిర్ధారించుకున్నాకే మిగిలిన వారి పేర్లు తొలగిస్తామన్నారు.
38 క్వశ్చన్లు అడిగితే…
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను విచారించామని మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు అన్నారు. ముందుస్తు లెక్కల ప్రకారం 38 ప్రశ్నలు అడిగామన్నారు. గత ప్రభుత్వంలో అడ్వైజర్’గా ఉన్న సజ్జలను ఫోన్ అడిగామని, కానీ తాను ఇవ్వలేదన్నారు. సజ్జల విచారణకు సహకరించలేదని, ఘటన జరిగిన రోజు అక్కడ తాను లేనని చెప్పినట్లు సీఐ తెలిపారు. దర్యాప్తు ముగింపు దిశకు వచ్చినట్టేనన్నారు.
Also Read : భగ్గుమన్న నిడదవోలు.. కూటమిలో కొట్లాట?