YCP Mudragada Daughter: కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు స్వయానా ఆయన కుమార్తె షాకిచ్చింది. ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వారుండరు. ఎన్నికల సమయంలో ఈయన చేసిన విమర్శలు అన్నీ, ఇన్నీ కావు. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఘాటైన వ్యాఖ్యలు చేసి ముద్రగడ ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఓటమి చవిచూడడం ఖాయమని, కూటమిని నమ్మి ప్రజలు ఓట్లేస్తే మోసపోతారని కూడా విమర్శలు చేశారు. అయితే ముద్రగడ కుమార్తె క్రాంతి మాత్రం పవన్ కు జైకొట్టారు. తాను పవన్ వెంటే అంటూ క్రాంతి చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ సీరియస్ అయ్యారు. తన కుటుంబంలోకి పవన్ ప్రవేశించి తనకు, తన కుమార్తెకు జగడం పెట్టారని ముద్రగడ ఆరోపించారు.
అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని, పవన్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని శపథం కూడా చేశారు. ఇలా శపథం చేసిన ముద్రగడకు ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. పవన్ పిఠాపురంలో సుమారు 70 వేల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు. ఇక అంతే తాను మాట తప్పను, మడమ తిప్పను అంటూ ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటున్నట్లు చెప్పడమే. అలా చెప్పారో లేదో.. ఇలా తన పేరు అధికారికంగా మార్చుకున్నారు ముద్రగడ.
ఆ సమయంలో ముద్రగడ లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ కూడా సాగాయి. వీటిపై ముద్రగడ స్పందిస్తూ.. జనసేన కార్యకర్తలు తనను ట్రోలింగ్ చేస్తూ శునకానందం చెందుతున్నారని, అటువంటి వాటిని తాను పట్టించుకోనని ప్రకటించారు. ఇలా ముద్రగడ పేరు ఎన్నికల సమయంలో మారుమ్రోగింది.
Also Read: Dhanteras 2024: ధంతేరస్లో అమ్మ వారికి ధనియాలు సమర్పిస్తే అదృష్టం వరిస్తుంది
కాగా తాజాగా ముద్రగడ పేరు మరోమారు వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరడమే. ఎన్నికల సమయంలో తన మద్దతు పవన్ కు అంటూ ప్రకటించిన క్రాంతి, తాజాగా జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. నాన్నను కాదని, క్రాంతి జనసేనలో చేరడం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా తండ్రిని ఎదిరించి తనకు మద్దతు పలికిన క్రాంతికి రాజకీయ భవిష్యత్ అందించాలన్న సంకల్పంతో పవన్ ఉన్నట్లు సమాచారం. పార్టీలో కీలకపదవి తో పాటు.. నామినేషన్ పోస్టు కూడా క్రాంతికి ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే క్రాంతికి వివాహం చేసిన తరువాత, తనకు సంబంధం లేదని చెప్పిన ముద్రగడ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.