Diarrhea In Gurla: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్ల గ్రామంలో పర్యటించిన కొద్ది క్షణాలకే మరొకరు డయేరియా వ్యాధితో మృతి చెందారని, ఈ మరణాలను ఆపేందుకు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల గ్రామంలో డయేరియా వ్యాధికి గురై పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గుర్ల గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన పవన్.. అక్కడి డయేరియా రోగులతో మాట్లాడారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చేందుకు వ్యక్తిగతంగా ఒకొక్కరికి లక్ష రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాగా పవన్ కళ్యాణ్ పర్యటించిన అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
బొత్స మాట్లాడుతూ.. తాను ఈ విషయంలో రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని, తాను స్వయంగా గత నాలుగు రోజులుగా ఇక్కడ పర్యటిస్తున్నందుకే, ప్రభుత్వంలో ఇప్పటికైనా చలనం వచ్చిందన్నారు. ఏనాడు కూడా చీపురుపల్లి నియోజకవర్గంలో డయేరియా వ్యాధితో మరణాలు సంభవించలేదని, ప్రస్తుతం మానిటరింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో డయేరియా వ్యాధి నియోజకవర్గంలో ప్రబలిందన్నారు. సీఎం చంద్రబాబు 8 మంది చనిపోయారని ప్రకటించారని, నేడు పవన్ 10 మంది అంటూ తెలిపారని, కానీ ప్రజలు చెబుతున్న లెక్క ప్రకారం డయేరియా వ్యాధితో 16 మంది చనిపోయినట్లు బొత్స తెలిపారు. ఈ మరణాలకు పూర్తి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు.
ఖచ్చితంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరణాలను ఆపాల్సిన బాధ్యత గల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తమ వల్ల కాదంటే, వైసీపీ తరఫున తామే నియోజకవర్గంలో ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తామన్నారు. గ్రామాలలో సర్వే నిర్వహించాల్సిన వైద్యాధికారులు.. ఎక్కడా కనిపించడం లేదని, వ్యాధి లక్షణాలు గల గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసిన అనంతరం, మరొకరు డయేరియాతో మృతి చెందడం చీపురుపల్లి నియోజకవర్గంలో వ్యాధి తీవ్రతకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు ప్రకటించడంతో పాటు, ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. గత ప్రభుత్వం వల్లనే వ్యాధులు వస్తున్నాయంటూ పవన్ ప్రకటించడం తగదని, తమ పరిపాలన సమయంలో ఎన్నడూ మరణాలు సంభవించలేదన్నారు.