Nimmala Ramanaidu: ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడికి వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘మీరు నన్ను ట్రోల్ చేయలేదా? నేను కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తాను. మంచైనా, చెడైనా ట్రోల్ చేస్తారు మరీ’ అంటూ పేర్కొన్నారు. అసలు మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా ముందుకు ఎందుకు వచ్చి ఏం వివరణ ఇచ్చారో అర్థం కాలేదని, కేవలం ట్రోలింగ్కు భయపడి మీడియా ముందు వివరణ ఇవ్వడానికి వచ్చినట్టు ఉన్నదని తెలిపారు.
తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు విమర్శలు చేశారు. బడికెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం డబ్బులు ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని, ఇప్పుడేమో జీవోలో మాత్రం ప్రతి తల్లికి రూ. 15 వేలు ఇస్తామని పేర్కొన్నారని అంబటి వివరించారు. దీన్ని సరిచేస్తారా? లేదా? అనేది చెప్పకుండా ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం మంత్రి నిమ్మల చేశారన్నారు. జీవోలోనే స్పష్టంగా పేర్కొన్నాక ఇంకా విధివిధానాలు ఖరారు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఉచిత ఇసుక అమ్మబడును అన్నట్టుగా కూటమి పాలన ఉన్నదని అంబటి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తల్లికి వందనం పథకంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకంపై ఈ స్పష్టత ఇవ్వకుండా మంత్రి నిమ్మల రామానాయుడు ఏమేమో మాట్లాడారని సెటైర్ వేశారు. ట్రోల్ చేశారని బాధపడి ఆయన మీడియా ముందుకు వచ్చినట్టు ఉన్నారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఫెయిల్ అయిందని, మిగితా ఐదు అమలు చేయకపోతే వైసీపీ వెంటబడుతుందని హెచ్చరించారు. ప్రజల తరఫున తమ పార్టీ పాలకులను నిలదీస్తుందని స్పష్టం చేశారు.
ఇక తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా ఉన్నారని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని, తమ నాయకుడు నిత్యం ప్రజలను కలుస్తున్నారని, జగన్ జనం మధ్య మమేకమయ్యే నాయకుడని వివరించారు. ఆయన ఎవరినీ కలవడం లేదనే చంద్రబాబు దుష్ప్రచారం దుర్మార్గమైనదన్నారు. తమ నాయకుడు ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉన్నారని స్పష్టం చేశారు.