AP Special Status: పార్టమెంట్లో వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన అఖిలపక్షం సమావేశానికి వైసీపీ తరపున ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైసీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. అంతే కాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైసీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీయూ డిమాండ్ చేసింది.
అఖిల పక్ష భేటీ తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని అన్నారు. ఢిల్లీలో టీడీపీ దాడులను ఎండగడతామని చెప్పారు. బుధవారం వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా శనివారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైసీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు.
Also Read: ప్రాజెక్టులు పెండింగ్.. రూ.1,355 కోట్ల కేంద్ర నిధులు మళ్లించేసిన జగన్ ప్రభుత్వం!
రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు , విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించేధర్నాకు అన్ని పార్టీలు కలసిరావాలని జగన్ పిలుపునిచ్చారు.