YCP : ఉత్తరాంధ్ర.. ఎన్నికల రణరంగానికి సిద్ధం అవుతుంది. ఎలక్షన్ శంఖరావాన్ని అక్కడ నుంచే YCP ప్రారంభించనుంది. 34 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో కీలకమైన నాయకత్వం ఉన్నా.. ఎందుకు ఇక్కడ ప్రత్యేక దృష్టి పెడుతుంది అనే చర్చ జోరుగా సాగుతుంది. విశాఖకు రాజధాని తరలింపు అని జగన్ ప్రకటన చేసినా.. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చకపోవటాన్ని ఆయన.. నేతలకు ఎలా వివరిస్తారు. వైసీపీ సిద్ధం మొదటి సభకు.. ఉత్తరాంధ్రనే ఎంచుకోవడంలో ఆంతర్యం ఏంటి.
ఉత్తరాంధ్ర.. ఎన్నికల రణరంగానికి సిద్ధం అవుతుంది. ఎలక్షన్ శంఖరావాన్ని అక్కడ నుంచే YCP ప్రారంభించనుంది. 34 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో కీలకమైన నాయకత్వం ఉన్నా.. ఎందుకు ఇక్కడ ప్రత్యేక దృష్టి పెడుతుంది అనే చర్చ జోరుగా సాగుతుంది. విశాఖకు రాజధాని తరలింపు అని జగన్ ప్రకటన చేసినా.. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చకపోవటాన్ని ఆయన.. నేతలకు ఎలా వివరిస్తారు. వైసీపీ సిద్ధం మొదటి సభకు.. ఉత్తరాంధ్రనే ఎంచుకోవడంలో ఆంతర్యం ఏంటి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో ఎన్నికల వాతావరణం హీట్గా మారింది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు.. YS షర్మిల రూపంలో కాంగ్రెస్ వేగం పెంచింది.. ఇప్పటికీ సీట్ల మార్పులు, చేర్పులు చేస్తున్న వైసీపీ దృష్టంతా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. నెల క్రితం వరకూ సామాజిక బస్సు యాత్ర పేరుతో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను చుట్టేసినా పెద్దగా ప్రభావం కనిపించలేదు. సభలకు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోవడంతో వైసీపీ నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిందని రాజకీయవర్గాలే అంటున్నాయి. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నా..అభ్యర్థుల సీట్లు మార్పుతో వైసీపీలో కొంత ఆందోళన మొదలైనట్లు కనిపిస్తుంది.
పదేళ్ల YCP రాజకీయంలో ఎక్కడా తగ్గని జగన్..వచ్చే ఎన్నికల్లో కూడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. పార్టీని వీడి ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వెళ్లిపోతున్నా…..జగన్ మాత్రం.. తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సన్నద్ధతతో వైసీపీ వెనకబడిందనే నిరుత్సాహం ఎక్కడా కనిపించకుండా.. కార్యకర్తలను సిద్ధం చేయడానికి ‘సిద్ధం’పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలకు నేతలు సిద్ధమవుతున్నారు.
అసలు.. ఏమిటీ సిద్ధం.. ఎందుకు సిద్ధం.. ఎవరి కోసం.. అనే మాటలకు సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధం అయ్యారు. వచ్చే ఎన్నికలకు.. కార్యకర్తలను సిద్ధం చేసి.. దిశానిర్దేశం చేయడానికి… నేరుగానే రంగంలోకి దిగుతున్నారు. దీని కోసం మొదటిగా ఉత్తరాంధ్రను ఎంచుకున్నారు. ఎన్నికల సమరం కోసం ఉత్తరంధ్రనే ఎంచుకోవడం వెనుక కారణాలేంటనే ఆలోచన అందరిలోనూ మొదలైంది. ఎన్నికల సమయంలో కానీ.. పథకాల ప్రారంభంలో కానీ.. తూర్పు నుండి ప్రారంభిస్తే మంచి జరుగుతుందనే సెంటుమెంటుని ఫాలో అవుతూ జగన్.. ‘సిద్ధం’ మొదటి సభను విశాఖ జిల్లా తగరపువలసను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. అసలు కారణం.. సెంటుమెంటు మాత్రమేనా లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే.. ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వైసీపీ ఎన్నికల మొదటి సభ ఉత్తరాంధ్రలో పెట్టడానికి సీఎం జగన్ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వైజాగ్ సిటీ తప్ప ఇతర ప్రాంతాలన్నీ వెనుకబడి ఉన్నాయని ఆది నుంచీ చెబుతున్న జగన్.. ఆ ప్రాంతానికి రాజధాని తరలిస్తామని ప్రకటన చేశారు. దానికోసం రెండు, మూడు సార్లు ముహూర్తం కూడా అనుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు.. తమను మోసం చేయరనే నమ్మకంతోనే జగన్.. వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారట. 34 నియోజకవర్గాలున్న ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సంపాదిస్తే.. అధికారం ఈజీగా కైవసం చేసుకోవచ్చన్నది వైసీపీ ప్లాన్. ఎన్ని రాజకీయ పార్టీలున్నా.. ఉత్తరాంధ్రలో టీడీపీ, వైసీపీదే హవా ఉంటుంది కాబట్టి ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాంధ్రపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
తగరపువలసలో ఏర్పాటు చేయదలచుకున్న వైసీపీ సభకు.. సుమారు మూడు లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఆ సభలో సీఎం జగన్ రాజధాని గురించి ఏం చెబుతారు.. అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. విశాఖ రాజధాని అని ప్రకటించి ఏళ్లు గడించింది. రాజధాని కోసం కార్యాలయాలను సిద్ధం చేసి వెనకడుగు వేశారనే వార్తలూ ఉన్నాయి. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ప్రకటన చేసిన సీఎం.. రాజధాని విషయంలో మూడు ఉమ్మడి జిల్లాల వైసీపీ కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు.. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఉత్తరాంధ్రలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో.. విమర్శలను కార్యకర్తల మనసులో నుంచి ఎలా తీసేస్తారనే చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఒక్కో ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుదంటూ అనేక సర్వేల్లో తేలింది. గత ఎన్నికల్లో జగన్ పాదయాత్ర ప్రభావం.. రాజన్న రాజ్యం ఏర్పాటు లాంటివి ప్రభావితం చేసినా.. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ బలంగానే కనిపిస్తున్నాయి. రాయలసీమలో వైసీపీ, కృష్ణా నుంచి నెల్లూరు వరకూ టీడీపీ, గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్న వేళ.. అటు ఉత్తరాంధ్ర ప్రజలనూ తమవైపు తిప్పుకునేందుకు జగన్ యత్నిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
34 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ అనే సర్వేలు చెబుతున్నాయి. అందుకే మొదటి సభను ఆ ప్రాంతంలో పెట్టి.. తమ పార్టీకి ఉత్తరాంధ్రపై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని జగన్ భావిస్తున్నారట. దీనికోసమే.. విజయనగరం, విశాఖ జిల్లాల మధ్య సభ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్ ఆధ్వర్యంలో మొదటి సభకు వచ్చే వారంతా వైసీపీ కార్యకర్తలే కాబట్టి.. వారి మధ్యకు వెళ్లి మాట్లాడినా వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు ఉండకపోవచ్చనే భావనలో పార్టీ ఉందని సమాచారం. ఉత్తరాంధ్ర అభివృద్ధి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ , రైల్వే జోన్, విశాఖ రాజధాని లాంటి ప్రధానమైన సమస్యలు ఉన్నా వాటి ప్రస్తావన రాకుండా.. కేవలం ఈ నాలుగున్నర ఏళ్లల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా సిద్ధం చేస్తుందా లేదాప్రధాన సమస్యలకు సమాధానం చెప్పి… ఎన్నికల కోసం సిద్ధం చేస్తుందా అనేది వేచి చూడాలి.