YCP Focus on Ongole: ప్రకాశం జిల్లా అభ్యర్థులపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో విజయసాయిరెడ్డి చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని బాలినేని ఇంటికి వెళ్లిన విజయసాయి.. ఆయనతో 4 గంటలుగా చర్చలు జరుపుతున్నారు. గిద్దలూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం బాలినేనికి సూచించినట్లు సమాచారం. తాను గిద్దలూరు నుంచి పోటీ చేస్తే, అద్దంకి సీటును తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఇవ్వాలని బాలినేని షరతు పెట్టినట్లు చెబుతున్నారు. అయితే.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి సీట్లు ఇవ్వడం కుదరదనే ఇప్పటికే సీఎం జగన్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
అధిష్టానం వైఖరిపై కొన్నాళ్లుగా బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాలో తనకు ప్రాధాన్యం తగ్గించారని, తన ప్రమేయం లేకుండానే మార్పులు జరుగుతున్నాయని బాలినేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారం సీట్లు కేటాయిస్తే గెలిచేది కష్టం అని బాలినేని ఇప్పటికే తెగేసి చెప్పారు. దాంతో ఆయన్ను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం ఎంపీ విజయసాయిని రంగంలోకి దింపింది.
మరోవైపు వైసీపీ అభ్యర్థులను మారుస్తుండటంపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగానే అభ్యర్థుల మార్పులు జరుగుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పార్టీ విధి విధానాలు బట్టి అభ్యర్థుల మార్పులు ఉంటాయని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీలో కూడా అభ్యర్థుల మార్పులు ఉంటాయని తెలిపారు. అప్పుడు తమ అభ్యర్థులను చంద్రబాబు ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎర్రగొండపాలెం నుంచి మంత్రి సురేష్ ని కొండపి నియోజక వర్గానికి మారుస్తూ ఇటీవల వైసీపీ అధిష్టానం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజక వర్గ అధికారులు, వైసీపీ నాయకులతో మంత్రి సురేష్ సమావేశం అయ్యారు.