Duvvada Srinivas Madhuri: మీడియా, సోషల్ మీడియాలో అంతా వీరి మాటలే.. వీడియోలే. వీరు చెప్పే మాటలు కూడా నిత్యం వార్తల్లో ఉండాల్సిందే. అంతేకాదు ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లిన సమయంలో వీరిద్దరూ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. టీటీడీ, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఇంతలా చెప్పిన తరువాత, వారిద్దరూ ఎవరో మీ మదిలో మెదిలింది కదా. ఔను వారిద్దరే.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం అందరికీ తెలిసిందే. ఈ వివాదం సమయంలో అనూహ్యంగా దివ్వెల మాధురి పేరు తెరపైకి వచ్చింది. మాధురి కూడా తన పేరు వెలుగులోకి రాగానే.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తాను రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ కు అండదండగా ఉన్నట్లు, తాము అన్యోన్యబంధంతో ఉన్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనతో సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ కూడా పెరిగింది. స్వతహాగా నృత్యకారిణి అయినటువంటి మాధురికి ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారు. ఇదే అదునుగా భావించిన మాధురి తన పేజీల ద్వారా వీడియోలు పోస్ట్ చేయడంలో స్పీడ్ పెంచారనే చెప్పవచ్చు. వాటికి వ్యూస్ కూడా అదే స్పీడ్ తో వస్తున్నాయి.
అంతవరకు ఓకే ఇటీవల తిరుమలకు వెళ్లిన సమయంలో తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే, తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్లు మాధురి తెలిపారు. అలాగే శ్రీనివాస్ కూడా తాను మాధురికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని, ఖచ్చితంగా వివాహం చేసుకుంటామన్నారు. ఈ వార్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందుకు ప్రధాన కారణం వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసి ఉన్నా.. వివాహం పేరెత్తకుండా తిరుమల పర్యటన సమయంలో అసలు విషయాన్ని చెప్పేశారు.
రంకు-బొంకు సన్నాసుల గురించి మనకు వద్దు! కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులే మనకు ముద్దు – జనసేన పార్టీ అధికార ప్రతినిధి సోదరి @RayapatiAruna గారు 👌👌👌 pic.twitter.com/08RF3gMPvG
— JSP Naresh (@JspBVMNaresh) October 16, 2024
ఇలా దువ్వాడ వివాదం సమయం నుండి నిరంతరం మీడియాలో నిలుస్తున్నారు వీరిద్దరు. అంతేకాదు ఇటీవల కొంత జోష్ పెంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వీరిద్దరీ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇలా వీరిద్దరి వీడియోలు, కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతుండగా.. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కి వీరిని వాడుకుంటోందని జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ ఇటీవల కామెంట్ చేశారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే వరదల సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పల్లె పండుగ వారోత్సవాలు ప్రజల్లోకి వెళ్లకుండా వీరిద్దరిని వైసీపీ పావుగా వాడుకుంటోందన్నారు. అంతేకాదు వీరు చేసే కామెంట్స్ కూడా ప్లాన్ ప్రకారం చేస్తున్నారని, కూటమి పార్టీల కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. డైవర్షన్ పాలిటిక్స్ విషయాన్ని గమనించి, ప్రభుత్వం తరపున అమలవుతున్న పథకాల గురించి ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలన్నారు. వైసీపీ ప్లాన్ చేసిందో లేదో కానీ, ఈ జంట డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారన్న ఆరోపణ చేసిన అరుణ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై దువ్వాడ, మాధురి స్పందన ఎలా ఉంటుందో..!