YCP News (Latest news in Andhra Pradesh) : విశాఖపట్నం రుషికొండ కొంతకాలంగా ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ కొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టడంతో వివాదం మొదలైంది. వైసీపీ ప్రభుత్వం ప్రకృతిని విధ్వంసం చేస్తోందంటూ టీడీపీ, జనసేన విమర్శలు గుప్పించాయి. శనివారం వైసీపీ అధికారిక ఖాతా నుంచి చేసిన ఓ ట్వీట్ పెను దుమారాన్ని రేపింది.
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించారని శనివారం చేసిన ట్వీట్ లో వైసీపీ పేర్కొంది. రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారని తెలిపింది. దానిపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం ఆ పార్టీకి ఇష్టం లేదనిపిస్తోందని ఆ ట్వీట్లో విమర్శించింది. అయితే ఆదివారం వైసీపీ మరో ట్విస్ట్ ఇచ్చింది.
శనివారం రాత్రి చేసిన ట్వీట్ను వైసీపీ డిలీట్ చేసింది. రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోందని పొరపాటున ట్వీట్ చేశామని వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్నాయని వైసీపీ తాజాగా ట్వీట్ చేసింది.
రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ ఒక్కరోజులోనే మాట మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ సచివాలయం నిర్మిస్తున్నారని వైసీపీ ట్వీట్ చేసిన వెంటనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వెనక్కి తగ్గిందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.