Chittoor MLA Arani Srinivasulu meet pawan Kalyan(Political news in AP): చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి గుడ్ చెప్పే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు జనసేన నేతలు కూడా హైదరాబాద్ వచ్చారు. శ్రీనివాసులు జనసేనలో చేరడం ఇక లాంఛనమే. ఆయన తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ తరఫున ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ దక్కదని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్నారు. ఇక వైసీపీకి గుడ్ చెప్పడమే మంచిదనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ క్రమంలోనే జనసేనానితో భేటీ అయ్యారు.
Read More : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మళ్లీ ఉద్ధృతం.. కార్మికులు మహా పాదయాత్ర ..
ఆరణి శ్రీనివాసులు జనసేన తరఫున తిరుపతి నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. ఈసారి ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేయబోతున్నారు.
తిరుపతిలో టీడీపీకి మంచి బలం ఉంది. గతంలో అనేకసార్లు టీడీపీ అభ్యర్థులు ఇక్కడ గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో తిరుపతిలో పోటీ హోరాహోరీగా సాగింది. చివరికి వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు.
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు తిరుపతి టిక్కెట్ కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే ఇక్కడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతవరకు జనసేనాని పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాలేదు. ఆ విషయంలో స్పష్టత వస్తే.. తిరుపతిలో టీడీపీ పోటీ చేస్తుందా? జనసేన బరిలోకి దిగుతుందా అనేది తేలిపోతుంది.
తాజాగా పరిణామాలను బట్టి చూస్తే తిరుపతి టిక్కెట్ జనసేనకే ఇస్తారని తెలుస్తోంది. అందువల్లే ఆరణి శ్రీనివాసులు ఆ పార్టీలోకి చేరతారనే చర్చ నడుస్తోంది.
పవన్ కల్యాణ్ తో భేటీ అయిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై వైసీపీ యాక్షన్ తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ కేంద్ర కార్యాలయ ప్రకటించింది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు విజయానందరెడ్డి వైసీపీ అధిష్టానం అప్పగించడంతో ఎమ్మెల్యే శ్రీనివాసులు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే వైసీపీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకుంది.