YCP Changes : ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేయాలని వైసీపీ అధినాయకత్వం చూస్తుందన్ని విమర్శలు సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చేస్తున్నారు. ఇప్పటికి రెండు విడతలుగా 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. ఆ కసరత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు మారిపోతుండటంతో మిగిలిన నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో.. తమ టికెట్ ఏమవుతుందోనని ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు.
వైసీపీ ఇన్చార్జ్ల మార్పు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన రెండో జాబితాలో పి.గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును పూర్తిగా పక్కన పెట్టేశారు .. అదే వర్గానికి చెందిప పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్థానంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఇన్చార్జ్ అయ్యారు. ఇక రెండో జాబితాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కదిరి శాసనసభ్యుడు పీవీ సిద్దారెడ్డి టికెట్లు గల్లంతయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయనభార్య రాజ్యలక్ష్మికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మంత్రుల విషయానికొస్తే ఉష శ్రీచరణ్ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు.. వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కు మార్చారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్కు టికెట్ విషయంలో హ్యాండ్ ఇచ్చేశారు. ఆయనకు ఏ టికెట్ ఇస్తారో చెప్పకుండా గాల్లో పెట్టారు..
అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ ఇన్చార్జ్గా మార్చారు. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్తో ఎంపీకి మొదటి నుంచి వర్గపోరు కొనసాగుతోంది. రంగయ్య వర్గానికి చెందిన నాయకుడు కళ్యాణదుర్గం పురపాలక సంఘానికి ఛైర్మన్గా ఎన్నికైనా, చాలాకాలంపాటు ఆయన్ను బాధ్యతలు చేపట్టనివ్వకుండా మంత్రి అడ్డుకున్నారని ఎంపీ వర్గం ఆగ్రహంతో ఉంది.. రెండు వర్గాల వారు పరస్పరం కేసులూ పెట్టుకున్నారు.. ఈ వర్గపోరును సర్దుబాటు చేసేందుకే ఇప్పుడు రంగయ్యను కళ్యాణదుర్గానికి, మంత్రి ఉషను పెనుకొండకు మార్చారంటున్నారు.
ఎంపీ మార్గాని భరత్ మొదటి నుంచీ రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు … అక్కడే తన పట్టును నిలబెట్టుకునేందుకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం ప్రయత్నించడంతో ఆయనకు, భరత్కు మధ్య వర్గపోరు సాగింది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు రాజకీయ పలుకుబడి లేనివారిని పార్టీ సమన్వయకర్తలుగా నియమింపజేస్తూ వచ్చారు భరత్. ఇప్పుడు భరత్కే ఆ టికెట్ ఖరారైంది.
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత 2019లో ఎంపీలుగా ఎన్నికైనా.. ఇద్దరు అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తూ వచ్చారు.. మాధవి అటు పాడేరు, ఇటు అరకుపై దృష్టిపెట్టారు. ఇప్పుడు ఆమెకు అరకు దక్కింది. వంగా గీత గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంపైనే ఫోకస్ పెట్టి ఇప్పుడు అదే టికెట్ దక్కించుకున్నారు.
పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరకు లోక్సభకు, పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణ అనంతపురం లోక్సభకు ఇన్చార్జ్లుగా నియమితులయ్యారు. శంకరనారాయణపై పెనుకొండలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ సారి ఆయనకు టికెట్ ఇస్తే ఊరుకోబోమని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పారు. శంకరనారాయణ సామాజికవర్గ ఓట్లు అనంతపురం జిల్లాలో భారీగా ఉన్నందున ఆయన్ను పక్కనపెడితే పార్టీకి ఇబ్బంది కలగవచ్చనే అంచనాతో.. అనంతపురం లోక్సభ టికెట్ ఆయనకు ఖరారు చేశారంటున్నారు
పిల్లి సుభాష్చంద్రబోస్ తన సొంత నియోజకవర్గం రామచంద్రపురాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగానే పోరాడాల్సి వచ్చింది. అక్కడ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో యుద్ధమే చేశారు. బోస్ వర్గీయులపై మంత్రి మనిషి దాడికి దిగేంతవరకూ పరిస్థితి వెళ్లింది. వీరి వ్యవహారంలో సీఎంఓలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. చివరకు బోస్ తనకు లేదా తన కుమారుడికి రామచంద్రపురం టికెట్ ఇవ్వకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసైనా సరే స్వతంత్రంగా పోటీచేస్తానని అల్టిమేటం జారీ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. ఎట్టకేలకు ఆయన కుమారుడికి ఇప్పుడు రామచంద్రపురం సమన్వయకర్త పదవి దక్కింది.
ఇక వారసులకు టికెట్లు ఇచ్చేది లేదన్న జగన్ సెకండ్ లిస్టులో అయిదుగురు వారసులకు టికెట్ కేటాయించడం గమనార్హం.. తిరుపతి ఇన్చార్జ్గా భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్రెడ్డి, చంద్రగిరి ఇన్చార్జ్గా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కొడుకు మోహిత్రెడ్డి, మచిలీపట్నం ఇన్చార్జ్గా పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, రామచంద్రపురం ఇన్చార్జ్గా ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ఖరారయ్యారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫాకు బదులు ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ ఇచ్చారు.
బళ్లారికి చెందిన మాజీ మంత్రి బి.శ్రీరాములు సోదరి జోలదరాశి శాంత వైసీపీలో చేరిన గంటల వ్యవధిలోనే ఎంపీ టికెట్ దక్కించుకోగలిగారు .. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను పూర్తిగా పెట్టేసిన జగన్.. శాంతకు వైసీపీ కండువా కప్పగానే హిందూపురం లోక్సభ ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టేశారు. ఆమెకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రానికి హిందూపురం లోక్సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించేశారు. గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. మొత్తమ్మీద ఈ మార్పులు చేర్పులతో మిగిలిన సిట్టింగుల్లో గుబులు రేగుతోందంట.. నెక్స్ట్ లిస్ట్లో ఎవరి టికెట్లు చిరుగుతాయో అని తెగ బెంబేలు పడిపోతున్నారంట.