Gannavaram: నివురుగప్పిన నిప్పులా ఉన్న గన్నవరం.. ఒక్కసారిగా భగ్గు మంది. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు విరుచుకుపడ్డారు. వందలాది మంది రాళ్లు, కర్రలతో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు.
టీడీపీ ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు. ఫర్మీచర్ ధ్వంసం చేశారు. నానా రచ్చ చేశారు. ఆవరణలో ఉన్న కారుకు నిప్పుపెట్టారు. ఒకేసారి వందలాది మంది వైసీపీ శ్రేణులు దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కొన్నాళ్లుగా టీడీపీ పెద్దలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే గన్నవరం నుంచి పోటీ చేయాలంటూ చంద్రబాబును, లోకేశ్ ను సవాల్ చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచీ గన్నవరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
స్థానిక టీడీపీ నేతలను ఎమ్మెల్యే వంశీ వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలుగు తమ్ముళ్లు. వంశీపై చర్యలు తీసుకోకపోతే వైసీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ నేతపైనే కంప్లైంట్ చేస్తారా? తమ కార్యాలయాన్నే ముట్టడిస్తారా? అంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసుపై దాడి చేసి రివర్స్ అటాక్ కు దిగారు. ఎమ్మెల్యే వంశీ అనుచరుల బీభత్సంలో గన్నవరం గరంగరంగా మారింది.
తమ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ వర్గీయులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వల్లభనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాసేపటి తర్వాత వైసీపీ, టీడీపీ వర్గీయులు ఎదురెదురు పడగా మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను కట్టడి చేశారు. రాళ్ల దాడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తలకు గాయమైంది. గన్నవరంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.
మరోవైపు, ఎమ్మెల్యే వంశీకి టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. గన్నవరంలో కూర్చొని దాడులు చేయడం కాదు.. దమ్ముంటే విజయవాడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి రా.. నువ్వో నేనో తేల్చుకుందాం.. అంటూ చాలెంజ్ చేశారు.