YSRCP: అనుకున్నట్టే అయింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమితో జగన్ సీరియస్గా స్పందించారు. ఇక ఉపేక్షించేది లేదంటూ.. పార్టీ నుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
విప్ ధిక్కరించి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేశారు జగన్. ఆ విషయాన్ని సలహాదారు సజ్జల ప్రకటించారు.
ఒక్కొక్క ఎమ్మెల్యేకు చంద్రబాబు 15 నుంచి 20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్పై అంతర్గతంగా విచారణ చేశామని.. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్లు పార్టీ గుర్తించిందని చెప్పారు. దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామన్నారు సజ్జల. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ.. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలవడాన్ని అధికార వైసీపీ తట్టుకోలేకపోతోంది. మేటర్ను సీరియస్గా తీసుకుంది. రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనంలు ఎలాగూ టీడీపీకే ఓటు వేస్తారని ముందే భావించింది. రెండు ఓట్లు పోయినా.. టీడీపీకి కావాల్సిన సంఖ్యాబలం ఉండదని అనుకుంది. కానీ, అనూహ్యంగా ఆ ఇద్దరితో పాటు మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థికి అనురాధకు ఓటేశారు. వైసీపీకి షాక్ ఇచ్చారు.
ఆ ఇద్దరు ఎవరా అని వైసీపీ ఆరా తీసింది. ఒకరు ఉండవల్లి శ్రీదేవి కాగా, ఇంకొకరు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అని తేలింది. శ్రీదేవిపై పార్టీ అధిష్టానానికి మొదటినుంచీ అనుమానం ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు పోలింగ్కు ముందుగానే ఎమ్మెల్యే శ్రీదేవి కూతురుతో కలిసి జగన్ను కలిశారు. తాను పార్టీ లైన్కే కట్టుబడి ఉన్నానని చెప్పారు. నిజమేనని జగన్ నమ్మారు. తీరా ఓటింగ్లో శ్రీదేవి హ్యాండ్ ఇచ్చారని తేల్చారు. తాను క్రాస్ ఓటింగ్ చేయలేదంటూ గట్టిగా సమర్థించుకున్నారు శ్రీదేవి. కానీ, పక్కాగా నిర్థారించుకున్నాక ఉండవల్లిపై వేటు వేసింది పార్టీ. ఆ వెంటనే టీడీపీ ఎమ్మెల్సీ అనురాధకు శుభాకాంక్షలు చెబుతూ.. శ్రీదేవి ట్వీట్ చేయడం ఆసక్తికరం.
సస్పెన్షన్పై రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఘాటుగానే స్పందించారు. చేతిలో అధికారం ఉందని తనపై వేటు వేశారని.. పార్టీలో పెత్తందారి విధానం నడుస్తోందని మండిపడ్డారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని తప్పుబట్టారు.
తన సస్పెన్షన్పై సంతోషం వ్యక్తం చేస్తూనే.. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి. తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని.. తాను వైసీపీకే ఓటు వేశానని చెప్పారు.