ఏపీలో కొద్దిరోజులుగా గన్నవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ వైసీపీ టిక్కెట్ విషయంలో వార్ నడుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ ఓడిపోయినా యార్లగడ్డ వెంకట్రావు మరోసారి తనకే టిక్కెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. యార్లగడ్డ పార్టీ మారే పరిస్థితులు ఎదురయ్యాయి.
2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్నాళ్లు వైసీపీ గూటికి చేరారు. దీంతో అప్పటి నుంచి యార్లగడ్డ, వల్లభనేని మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వంశీకే పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. దీంతో యార్లగడ్డ అలిగారు.
వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. దీంతో యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నారు. కార్యకర్తలతో వరస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.యార్లగడ్డ టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే కొద్దిరోజుల క్రితం గన్నవరం నియోజకవర్గ అభిమానులతో యార్లగడ్డ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గన్నవరం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీ టిక్కెట్ వంశీకే అని దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. సజ్జల వ్యాఖ్యలతో యార్లగడ్డ వెంకట్రావు అంతర్మధనంలో పడ్డారని తెలుస్తోంది.
మరోవైపు సీఎం జగన్ విజయవాడ పర్యటన వేళే యార్లగడ్డ కూడా బెజవాడలోనే సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅనుచరులతో సమాలోచనల తర్వాత రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.