Kurnool: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను హతమార్చి ఆపై ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఉదయం కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. కర్నూలు త్రీ టౌన్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నందికొట్కూరులో విజయ్ కూమార్(35) అనే వ్యక్తి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కంపేనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రుక్సాన అనే మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి విషయం రుక్సాన కుటుంబంలో తెలియడంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం విజయకుమార్ , రుక్సానాతో కలిసి కర్నూలులో ని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఎంత సేపటికీ గది తలుపులు తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టారు. గదిలో రుక్సానా, విజయ్ కుమార్ మృతి చెంది ఉన్నారు. మహిళ మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో విజయకుమార్ మొదట ఆమెను కత్తితో పొడిచి.. తర్వాత అతను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.