Minister Atchannayudu Key Comments: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పెన్షన్లకు సంబంధించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బోగస్ పెన్షన్లను ఏరివేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో నేడు రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉదయం 8.30 గంటల వరకే దాదాపుగా 63 శాతానికి పైగా పింఛన్ల పంపిణీని అధికారులు పూర్తి చేశారు. మొత్తం 64.82 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా రూ. 1739 కోట్లు పంపిణీ చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండున్నర గంటల సమయంలోనే 64 శాతం పెన్షన్లను పంపిణీని పూర్తి చేయడం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: ఒలింపిక్స్లో స్వప్నిల్ కుశాల్కు కాంస్యం.. విషెస్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మాత్రం పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడానికి వారం రోజుల సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం కంటే తక్కువ మంది సిబ్బందితోనే పింఛన్ల పంపిణీని ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తామంటూ చంద్రబాబు పేర్కొన్నారు. నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల పెండింగ్ పింఛన్ తో కలిపి రూ. 7 వేలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఈ నెల నుంచి రూ. 4 వేల పెన్షన్ పంపిణీ చేస్తున్నది.