NTR, JAGAN : ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పై మల్లెల బాబ్జి అనే దళిత యువకుడు దాడి చేశాడు. ఆయనపై చాకుతో దాడి చేశాడు. అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. బాబ్జికి క్షమాభిక్ష పెట్టమని అభ్యర్థించారు. దీంతో దాడి కేసు నుంచి మల్లెల బాబ్జీ బయట పడ్డాడు. కోడికత్తి కేసు విషయంలో నిందితుడు శ్రీనివాసరావు కూడా దళితుడే. ఈ కేసుపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోడికత్తి కేసు నిందితుడు శ్రీను విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందించాలని హర్షకుమార్ కోరారు. రాజమండ్రి కారాగారంలో తాను ఉన్నప్పుడు శ్రీను తరచూ తనను కలిసేవాడని తెలిపారు. ఎలాగైనా తాను రాసిన ఉత్తరం బయట పెట్టించండి. నా నిజాయతీ తెలుస్తుంది. నిజంగా జగన్ అభిమానిని. జగన్కు సింపతీ వస్తుందని.. ఆయన కుటుంబ సభ్యుడిగా గుర్తిస్తారనే దృష్టితోనే దాడి చేశానని చెప్పాడని హర్షకుమార్ ట్వీట్లో పేర్కొన్నారు.
సీఎం జగన్ తీరుపై హర్షకుమార్ విమర్శలు చేశారు. నాడు ఎన్టీఆర్ మాదిరిగా జగన్ వ్యవహరించడంలేదని మండిపడ్డారు. సీఎం కోర్టుకు రావడానికి ఇష్టపడటం లేదన్నారు. మరోవైపు కుట్ర కోణంలో దర్యాప్తు చేయమంటున్న విషయాన్ని గుర్తు చేశారు. శ్రీను రాసిన లెటర్ను ఎన్ఐఏ తక్షణం బయట పెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. జగన్ కోర్టుకు వెళ్లి కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుకు క్షమాభిక్ష ప్రసాదించాలని హర్షకుమార్ కోరారు. మరి నాడు ఎన్టీఆర్ మాదిరిగా జగన్ నిర్ణయం తీసుకుంటారా..? కోర్టుకు హాజరై నిందితుడిని క్షమించేస్తారా..?