Ganta : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆరు స్థానాలు వైసీపీకే దక్కుతాయి. ఏడో సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఒక్క ఓటు తేడాతో వైసీపీ గెలుస్తుందా? టీడీపీ సంచలన విజయం సాధిస్తుందా అనే ఆసక్తి ఉంది. అయితే ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను స్పీకర్ ఇప్పుడు ఆమోదించారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే టీడీపీకి మరో ఓటు తగ్గుతుంది.
ఎమ్మెల్యే పదవికి రాజీమానా వ్యవహారంపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించారంటూ జరుగుతున్న ప్రచారం వైసీపీ మైండ్ గేమ్ గా పేర్కొన్నారు. రాజీనామా ఆమోదంపై తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వైసీపీ వేసిన ఎత్తుగడ అని గంటా విమర్శించారు. తన రాజీనామాపై చేస్తున్న దుష్ప్రచారం వల్ల వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గుతారనేది ఆ పార్టీ ప్లాన్ అని గంటా మండిపడ్డారు.
రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ను వ్యక్తిగతంగా రెండుసార్లు కలిశానని గంటా వెల్లడించారు. అప్పటి నుంచి రాజీనామాను ఆమోదించలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆ రాజీనామాను ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. ఓటర్ లిస్టు వచ్చాక రాజీనామా ఆమోదించడం సాంకేతికంగా కుదరదని స్పష్టం చేశారు. అలా చేస్తే వైసీపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసినట్లే అవుతుందన్నారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ నామినేషన్ పత్రాలపై ప్రపోజల్ సంతకం చేసింది తానేనని గంటా వెల్లడించారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటు వేస్తారా..?