AP Politics: ఏపీలోనే కాదు.. ఢిల్లీ స్థాయిలో వైసీపీ వీక్ అయ్యిందా? రాజ్యసభ సభ్యులతో హస్తినలో పైచేయి సాధించాలని భావించారా? ఈ విషయంలో జగన్ ప్లాన్ ‘రివర్స్’ అయ్యిందా? రివర్స్ అనే పదానికి బ్రాండ్ అయిన జగన్కు ఎందుకిలా జరుగుతోంది? అధికారం పోయిన తర్వాత ఆ పార్టీ ఎంపీల సంఖ్య క్రమంగా పడిపోతుందా? తాజాగా ఆర్ కృష్ణయ్య సైతం రాజీనామా చేయడంతో పెద్దల సభలో ఆ పార్టీ సంఖ్య ఎనిమిదికి పరిమితమైందా? రాబోయే రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ వుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
రాజకీయ పార్టీల్లో రాజ్యసభ ఎంపీ సీటుకు గట్టి పోటీ ఉంటుంది. అంగ, అర్థ బలం ఉన్నవారికే సొంతం అవుతుంది. ఇదంతా ఒకప్పటి మాట. ప్రాంతీయ పార్టీల్లో అయితే మరింత పోటీ ఉంటుంది. తాజాగా వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య.
ఏపీలో అధికారం కోల్పోయినా, రాజ్యసభలో బలం ఉండడంతో మెల్లగా నెట్టుకురావచ్చని భావించింది వైసీపీ. కానీ అక్కడ కూడా సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటివరకు ఆ పార్టీలో రాజ్యసభకు రాజీనామా చేసిన ఎంపీల సంఖ్య మూడుకి చేరింది. రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు.
అధినేత వ్యవహారశైలి నచ్చన ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారా? లేక కావాలనే వెళ్లిపోతున్నారా? అనే డౌట్ చాలామంది నేతలను వెంటాడుతోంది. వైసీపీ అధికారం కోల్పోయి కేవలం 100 రోజుల్లో ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.
ALSO READ: ఫ్యామిలీ విభేదాలా? బొత్సకు తమ్ముడు ఝలక్, జనసేనలోకి అడుగులు..
కృష్ణయ్య రాజీనామాతో ఆ సీటు ఎవరికన్నది ఏపీ రాజకీయాల్లో చిన్నపాటి చర్చ మొదలైంది. ఎందుకంటే బీజేపీ అగ్రనేతలతో ఆర్ కృష్ణయ్యకు సంబంధాలున్నాయని అంటున్నారు. అందులోభాగంగా ఎంపీ పదవికి రాజీనామా చేశారన్నది కొందరి నేతల మాట. ఆ లెక్కన ఖాళీ అయిన సీటు బీజేపీకి వెళ్లడం ఖాయమని అంటున్నారు.
కృష్ణయ్య రాజీనామాపై టీడీపీ నేతలు సైలెంట్గా ఉన్నారు. ఆయన రాజీనామా వెనుక కారణాలు తెలుసుకునే పనిలోపడ్డారు కీలక నేతలు. నాలుగేళ్లు పదవీకాలం ఉండగా ముందుగా రాజీనామా వెనుక కారణాలు ఏంటని ఆరా తీస్తున్నారు. దీనివెనుక బీజేపీ గనుక ఉంటే ఎంపీ సీటు వారికే వెళ్తుందని అనుకుంటున్నారు. ఖాళీ అయిన సీటు గురించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని వార్తలు వస్తాయో చూడాలి.