Palnadu : ఆ గర్భిణీకి వచ్చిన కష్టం మరే స్త్రీ మూర్తికి రాకూడదు. నిండు చూలాలైన ఆమె.. పురిటి నొప్పులతో మూడు గంటల పాటు నరకయాతన అనుభవించింది. 70 కిలోమీటర్లు ప్రయాణించి.. డెలివరీ కోసం మూడు ఆసుపత్రులు తిరిగింది. చివరికి పండంటిబిడ్డకు జన్మనిచ్చింది. ఎంతో ఆనందించాల్సిన ఆ క్షణంలో.. ఊహించని వార్త చెవిన పడేసరికి బోరుమని విలపించింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సొంత జిల్లా అయిన పల్నాడులో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళ్తే.. కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళ నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం (అక్టోబర్ 20) రాత్రి 10 గంటలకు స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లారు. కానీ.. అక్కడ వైద్యసదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వారి సూచన మేరకు.. రాత్రి 11 గంటలకు గురజాల ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ కూడా అదే పరిస్థితి. గురజాలకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేట ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సిఫార్సు చేయగా.. చేసేది లేక అక్కడికే వెళ్లారు. తీరా ఆసుపత్రి వరకూ చేరుకోగానే.. రామాంజిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తల్లి బిడ్డను కనేందుకు పురిటినొప్పులతో ఎంత నరకయాతన పడినా.. బిడ్డ పుట్టగానే చూసుకుని ఆ నొప్పంతా మరిచిపోతుందంటారు. రామాంజిని కూడా అంతే సంతోషపడింది. కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ.. అంతలోనే ఊహించని పరిణామం జరిగింది. రామాంజిని బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే ఆమె భర్త మృతదేహం వచ్చింది.
కారంపూడి నుంచి గురజాల వరకూ తోడుగా వచ్చిన భర్త ఆనంద్ (40).. ఆసుపత్రి ఖర్చుల కోసం ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయల్దేరాడు. బైక్ పై ఇంటికి వెళ్లి తిరిగివస్తుండగా.. దారిమధ్యలో జోలకల్లు రహదారిపై ఉన్న పెద్దగుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆనంద్ ను నరసరావుపేట ఆసుపత్రికి తరలించగా.. బిడ్డను చూడకుండానే కన్నుమూశాడు. బిడ్డ పుట్టిందని ఆనందించేలోగానే భర్తను కోల్పోయింది ఆ మహిళ. ఆరోగ్యశాఖమంత్రి సొంతజిల్లాలోని కారంపూడి, గురజాల ఆసుపత్రుల్లో కనీసం సాధారణ కాన్పు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. రామాంజిని కాన్పుకోసం నరసరావుపేట ఆసుపత్రి వరకూ వెళ్లకుండా.. కారంపూడిలోనే డెలివరీ అయ్యి ఉంటే.. ఆనంద్ ఇలా ప్రమాదానికి గురయ్యేవాడు కాదేమో.