Thammineni seetharam : ఏపీ రాజకీయాల్లో తొడగొట్టడం ట్రెండ్ గా మారింది. గతేడాది టీడీపీ మహానాడులో ఆ పార్టీ నాయకురాలు కావలి గ్రీష్మ వేదికపై సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ తొడగొట్టడం పెను సంచలన రేపింది. ఓ మహిళా నాయకురాలు అలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబే ఆమెతో ఇలా చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. అప్పుడు కావలి గ్రీష్మ తొడగొట్టడంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత అమరావతి రైతుల పాదయాత్ర సమయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో కొందరు మహిళలు తొడగొట్టడం రాజకీయ దుమారం రేపింది. మాజీ మంత్రి కొడాలి నానిని సవాల్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు యథావిథిగా ఎటాక్ చేశారు. ఆ తర్వాత తొడగొట్టే రాజకీయాలకు కొంతకాలం విరామం వచ్చింది.
ఇప్పుడు స్వయానా శాసనసభాపతి తమ్మినేని సీతారాం తొడగొట్టడం చర్చనీయాంశమైంది. అసలు శాసనసభ స్పీకర్ తమ్మినేని ఎందుకు తొడగొట్టారు?. ఎవరిని సవాల్ చేశారనేది ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవిందరావు అధ్యక్షతన శనివారం కన్వీనర్లు, వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారని తమ్మినేని విమర్శించారు. ప్రజలు అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పారని అన్నారు. మళ్లీ జగన్కే ఓటేస్తామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళ తొడకొట్టి చెప్పిందని స్పీకర్ తెలిపారు. ఆమెను అనుకరిస్తూ తమ్మినేని సీతారాం తొడకొట్టారు. ఇలా జగన్ కే మళ్లీ ఓటేస్తామని ఆ మహిళ చెప్పిందనే సందర్భంలో స్పీకర్ తొడగొట్టడం ఆసక్తినిరేపింది.
ఇదే సమయంలో చంద్రబాబుపై స్పీకర్ పలు ఆరోపణలు చేశారు. నారావారి పల్లెలో రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబు ఇప్పుడు కోటీశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఆయన దగ్గర ఏమైనా మంత్ర దండం ఉందా..? అని అన్నారు. ఉంటే దాన్ని ప్రజలకు అందిస్తే రాష్ట్రంలో నిరుపేదలు ఉండరన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల కింద త్వరలో ప్రకటిస్తుందని వెల్లడించారు.