Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తెలంగాణ హైకోర్టు దృష్టికి సంచలన విషయాన్ని తీసుకొచ్చింది. వాదనల సమయంలో తమ వద్ద రహస్య సాక్షి స్టేట్మెంట్ ఉందని ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ రహస్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలంతో వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కుట్ర ఉన్నట్లు వెల్లడైందని సీబీఐ తెలిపింది. హత్య వెనుక రాజకీయ కారణాలు తప్ప మరే ఇతర కారణాలు లేవనే వాదనకు ఆ వాంగ్మూలంతో తిరుగులేని బలం చేకూరిందని స్పష్టం చేసింది.
వివేకా హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై శనివారం తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేరు వెల్లడించడానికి వీల్లేని రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ తమ వద్ద ఉందని తెలిపారు.
కడప ఎంపీ టికెట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్రెడ్డికి ఇవ్వొద్దని వైఎస్ వివేకా పట్టుబట్టినట్లు రహస్య సాక్షి వెల్లడించారని సీబీఐ తెలిపింది. ఆ సాక్షి చెప్పిన వివరాల ప్రకారం ఒక వేళ అవినాష్కే టికెట్ ఇస్తే తాను టీడీపీలో చేరుతానని వివేకా హెచ్చరించారని సీబీఐ పేర్కొంది. అయితే టికెట్ తనకే కావాలని వివేకా పట్టుబట్టలేదని, షర్మిల లేదా విజయమ్మకు ఇవ్వాలని పట్టుబట్టారని తెలిపింది. కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి వివేకా ఒకరిని ఒప్పించారని వివరించింది. అవసరమైతే అవినాష్రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వివేకా తెలిపినట్లు రహస్య సాక్షి వెల్లడించాడని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
భద్రత నేపథ్యంలో రహస్య సాక్షి పేరు ప్రస్తుతం బయటపెట్టలేమని, త్వరలోనే సప్లిమెంటరీ చార్జిషీట్లో ఈ స్టేట్మెంట్ను వెల్లడిస్తామన్నారు సీబీఐ అధికారులు. వీలైతే స్టేట్మెంట్ను సీల్డ్ కవర్లో సమర్పిస్తామన్నారు. అయితే ఈ విషయం అత్యంత రహస్యం అయినందున పిటిషనర్ అవినాష్రెడ్డి న్యాయవాదులకు ఎలాంటి పరిస్థితుల్లో తెలియరాదని అన్నారు. గతంలోనూ సాక్షుల పేర్లు వెల్లడించిన తర్వాత మారిపోవడమో.. మరణించడమో జరిగిందని తెలిపారు. ఇక వివేకా హత్యకు నెల రోజులు ముందే కుట్ర జరిగిందని, పథకం ప్రకారమే వివేకా హత్య జరిగినట్లు సీబీఐ లాయర్లు వాదనలు వినిపించారు.
వివేకా మర్డర్ స్పాట్కు చేరుకున్న మొదటి చట్టబద్ధమైన వ్యక్తి సీఐ శంకరయ్య అని.. అతడు అవినాష్రెడ్డికి వ్యతిరేకంగా సీఆర్పీసీ 161 స్టేట్మెంట్ ఇచ్చి.. మేజిస్ట్రేట్ వద్ద సీఆర్పీసీ 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి రాలేదని సీబీఐ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. అలాగే 10 కోట్లు ఇస్తాం.. హత్య చేసినట్లు ఒప్పుకోవాలని తనకు ఆఫర్ ఇచ్చారని చెప్పిన గంగాధర్రెడ్డి చనిపోయాడని సీబీఐ లాయర్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తాము రహస్య సాక్షి పేరును సరైన టైమ్లో చార్జిషీట్లో చేరుస్తామన్నారు.
వివేకా హత్య కేసులో కీలకంగా మారిన ఆ రహస్య సాక్షి ఎవరు? ఏప్రిల్ 26న రహస్య సాక్షి వాంగ్మూలం ఇచ్చారన్న సీబీఐ.. ఆ సాక్షి పేరు, వివరాలు ఇప్పుడే బయటపెట్టలేమని ఎందుకు చెప్తోంది? హత్య కేసును ఆ సాక్ష్యమే మలుపు తిప్పబోతోందా? ఆ రహస్య సాక్షి వైఎస్ కుటుంబంలోని వ్యక్తేనా..?