Nara Chandrababu Naidu :స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై భిన్నవార్తలు వినిపిస్తున్నాయి. జైలులో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు అంటున్నారు. కానీ జైలు అధికారుల వెర్షన్ మరోలా ఉంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని కాకపోతే స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని జైలు సిబ్బంది తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు.
మరోవైపు ఏదైనా అత్యవరసమైతే చంద్రబాబును తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ను సిద్ధం చేశారు అధికారులు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. వీఐపీలకు కేటాయించే ప్రత్యేక వార్డును క్లీన్ చేయించారు. అయితే జైలు సిబ్బంది ఏర్పాట్లు చూస్తుంటే టీడీపీ నేతల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
టీడీపీ నేతల ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు జైలు అధికారులు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని ఎలాంటి ఆపోహలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరుతున్నారు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారని కుటుంబ సభ్యులు అంటుంటే.. ఒక కేజీ బరువు పెరిగారని జైలు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇంకోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. చంద్రబాబుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. చంద్రబాబును రిమాండ్లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉందన్నారు. భద్రతలేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్ ప్రభుత్వం, జైలు అధికారులదే బాధ్యతని లోకేశ్ స్పష్టం చేశారు. స్కిల్ పేరుతో స్కామ్ చేశారు కాబట్టే జైలుకు వెళ్లారంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుకుంటున్నారు.