MP Magunta Srinivasulu will join in TDP Soon : రెండు వారాల క్రితం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు.. తర్వాత తన రాజకీయ ప్రయాణంపై తాజాగా ప్రకటన చేశారు. త్వరలోనే టీడీపీలో చేరుతానని స్పష్టం చేశారాయన. తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలో ఎప్పుడు చేరాలన్నది చంద్రబాబు, నారా లోకేశ్ లు నిర్ణయిస్తారని తెలిపారు.
వైసీపీ ఒంగోలు పార్లమెంట్ టికెట్ ను మాగుంటను కేటాయించకపోవడంతో ఆయన పార్టీని వీడిన సంగతి తెలిసిందే. పార్టీకి రాజీనామా తర్వాత టీడీపీ లేదా జనసేనలో చేరి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తాను రాజీకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పినట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన కొడుకు రాఘవరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తారని, తన కొడుకుకి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పనిచేయడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. మూడు పార్టీల నాయకులం కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
Read More: వైఎస్సార్ సర్వజన ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్
కాగా.. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న టీడీపీ నేతలను మాగుంట శ్రీనివాసులు అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలైన దామచర్ల జనార్థన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు, దర్శి ఇన్ఛార్జ్ రవికుమార్ వారితో భేటీ అయ్యారు. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా.. కీలక నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.