Kadiri: చిన్న విషయం. శాంతంగా మాట్లాడుకుంటే సరిపోయేది. కాస్త ఓపిక పట్టుంటే బాగుండేది. కానీ, క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంటి ముందుకు పక్కింటి వాళ్ల నీళ్లు వస్తున్నాయంటూ పెద్ద గొడవ జరిగింది. రెచ్చిపోయిన ఆ కుటుంబం.. బండరాళ్లతో ఆ గృహిణిని కొట్టి చంపింది. తీవ్ర కలకలం రేపిన ఈ దారుణం.. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది.
కదిరి, మశానంపేటలో ఉండే పద్మావతి ఫ్యామిలీకి, పక్కింట్లో ఉండే వేమన్న నాయక్ కుటుంబానికి తరుచూ నీళ్ల విషయంలో గొడవ జరుగుతుండేది. పద్మావతి ఇంట్లోని వాషింగ్ మిషన్ నుంచి బయటకు వచ్చే నీళ్లు.. వేమన్న నాయక్ ఇంటి ముందుకు వస్తున్నాయనేది వారి అభ్యంతరం. ఎప్పటిలానే మరోసారి వాషింగ్ మెషిన్ వాటర్ ఇంటి ముందు చేరడంతో వేమన్న నాయక్ కుటుంబం రెచ్చిపోయింది.
రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటలతో ఆగకుండా గొడవ ముదిరింది. ఘర్షణ మొదలైంది. వేమన్న నాయక్ కుటుంబసభ్యులు పద్మావతిపై బండరాళ్లతో దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు పద్మావతి ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. రక్తమోడుతున్న పద్మావతిని కదిరి ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యులు చేతులెత్తేశారు. దీంతో, మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పద్మావతి చనిపోవడంతో కదిరిలో విషాదం నెలకొంది. వాషింగ్ మెషిన్ వేస్ట్ వాటర్ గురించి జరిగిన గొడవలో పద్మావతి చనిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.