AP : పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఏపీలో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. బహిరంగ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను జనసేనాని ఎండగడుతున్నారు. వైసీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. పేర్ని నాని రెండు చెప్పులు చూపించడంపై పిఠాపురం సభలో వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అన్నవరం సత్యనారాయణస్వామి గుడికి వెళ్తే ఎవరో తన రెండు చెప్పులు కొట్టేశారంటూ సెటైర్లు వేశారు.
పవన్ విమర్శలకు వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. చెప్పులు పోయిన సంగతి 3రోజుల తర్వాత గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తారని కానీ ముందు పోయిన జనసేన గాజు గ్లాసు గుర్తు వెతుక్కోమని చురకలంటించారు.
పవన్ కల్యాణ్ కు మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్ చేశారు. ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తుందో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి పదవి అంటే ప్రజలు ఇవ్వాలని అడుక్కుంటే రాదని పవన్ కు చురకలు అంటించారు. 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సీఎం అవ్వరంటూ సెటైర్లు వేశారు.
పవన్ పూటకో వేషం వేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు. పవన్ స్థిరత్వం లేని వ్యక్తి అని అన్నారు. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్ పవన్ కు లభించిందన్నారు. నారాహి యాత్రను ప్రజలు పట్టించుకోరన్నారు.
పవన్ కల్యాణ్ను ఆ పార్టీ నేతలు మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. గంటకో విధంగా పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ను సీఎం కాదు కదా ఎమ్మెల్యే చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. పవన్ స్క్రిప్ట్ అంతా చంద్రబాబుదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆలోచన, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలకు మంత్రులు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. వారిపై జనసేనాని కూడా అదే రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. మరి పవన్ తను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇస్తారా? జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో స్పష్టం చేస్తారా?