కడపలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చెత్త వ్యవహారం పెద్ద రచ్చకు తెరలేపింది. చెత్త సేకరణ, చెత్త పన్నుపై.. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబుల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. అసలు ఇక్కడ జరుగుతోంది ఆధిపత్య పోరా.. లేక నిజంగా ప్రజల కోసమే నేతలు సవాళ్లకి దిగుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కారణం ఏదైనప్పటికీ.. వీరి డైలాగ్ వార్ పొలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది.
జగన్ పాలనలో చెత్త పేరట నెల నెలా పన్ను వసూలు చేశారు. ఈ పన్ను మ్యాటర్ తీవ్ర దుమారం లేపినా.. డోంట్ కేర్ అంటూ వైసీపీ ముందుకు సాగింది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం వస్తే చెత్త పన్ను నిలిపివేస్తామని చంద్రబాబుతో పాటు కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన మాట మేరకు.. జూన్ నుంచి చెత్త పన్ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
గత ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ.. కడప కార్పొరేషన్ మాత్రం ఇంకా వైసీపీ పాలకవర్గం చేతుల్లోనే ఉంది. వైసీపీకి 50 మంది కార్పొరేటర్లు ఉంటే.. టీడీపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. దాంతో కార్పొరేషన్ పరిధిలో వారి ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు సాగించారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ హయాంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణకు వంద ఆటోలను తీసుకున్నారు. ఇవి అప్పటి వైసీపీ ముఖ్య నేతల అనుచరులవని టాక్ ఉంది. లక్షల్లో కార్పొరేషన్ నిధులను చెత్త ఆటోలకు చెల్లిస్తూ వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంటింటి నుంచి చెత్త పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. దాంతో కార్పొరేషన్ పై భారం పడిందని అందుకే చెత్త సేకరణ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి.
Also Read: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు
అలానే చెత్త పన్ను వసూలు చేయాల్సిందేనంటూ మేయర్ సురేష్ ఆదేశాలిచ్చారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో మాదిరి పన్ను వసూలు చేయాలని అన్నారు. పన్ను కట్టకపోతే చెత్తను సేకరించమంటూ వార్నింగ్ ఇవ్వడం పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ క్రమంలోనే కడప కార్పొరేషన్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చామని.. జీవో ఇవ్వకున్న చెత్త పన్ను వసూలు చెయ్యలేదని వ్యాఖ్యానించారు. కడప మేయర్ చెత్త పన్ను వసూలు చేసుకోమని చెప్పడం సరికాదని ఆమె మండిపడ్డారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే కడప కార్పొరేషన్ అధికారులు పని చేస్తున్నారని అన్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త ఎత్తక పోతే.. కమిషనర్, మేయర్ ఇంటి దగ్గర చెత్త వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలను మేయర్ సురేష్బాబు ఖండించారు. చెత్తపన్ను వసూలు చేయవద్దని ప్రభుత్వం అధికారిక ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇచ్చారని.. జీవో జారీ చేయలేదని తెలిపారు. చెత్త తొలగించడానికి కోట్ల రూపాయలు ఖర్చవుతోందని.. చెత్త ద్వారా రూ.25 లక్షలే రాబడి వస్తోందని స్పష్టం చేశారు. మూడు నెలల నుంచి ఎవరూ చెత్తపన్ను కట్టడం లేదని.. పన్ను వసూలు చేయకపోతే సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే హుందాతనంతో వ్యవహరించాలని సురేష్ బాబు కామెంట్స్ చేశారు.
ఎవరికి వారు తగ్గేదే లే అంటూ నేతలు వాగ్బాణాలు సంధిస్తున్న క్రమంలో.. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరింత ముదురుతోందని అభిప్రాయపడుతున్నారు. ప్రజలపై భారం పడకూడదని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. వైసీపీ నేతలు సొంత అవసరాల కోసం కాలరాయడం సరికాదంటూ మండిపడుతున్నారు. లోకల్ గా వైసీపీ పవర్ ఫుల్ గా ఉంటే.. స్టేట్ లో కూటమి ఆధిపత్యంలో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఎవరూ పై చేయి సాధిస్తారని జోరుగా చర్చించుకుంటున్నారు.