Jagan CBN: ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. జగన్ వర్సెస్ చంద్రబాబు అండ్ పవన్ కల్యాణ్ నడుస్తోంది. జగన్ ను వాళ్లు తిడతారు.. వాళ్లను జగన్ తిడతారు. రోజూ ఇదే తతంగం. ఆ విమర్శలు ఈమధ్య హద్దు మీరుతున్నాయి. సన్నాసులని తిట్టుకోవడం, చెప్పు తీసి కొడతా అనుకోవడం.. ఇలా అదుపు తప్పుతున్నారు నేతలు.
కందుకూరు దుర్ఘటన తర్వాత చంద్రబాబుపై విమర్శల డోసు పెంచింది వైసీపీ. సీఎం జగన్ సైతం రియాక్ట్ అయ్యారు. డ్రోన్ షాట్ల కోసం ఇరుకు రోడ్డులో జనాన్ని నెట్టారని. 8 మందిని చంపడం కన్నా ఘోరం ఉంటుందా? అని.. గతంలో పుష్కరాల్లో 29 మందిని చంపారని.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాలు అంటే షూటింగ్లు కాదు. రాజకీయం అంటే డైలాగులు కాదు, డ్రోన్ షాట్లు, డ్రామాలు కూడా కాదంటూ ఘాటుగా విమర్శించారు.
చంద్రబాబుతో లింకు పెట్టి పవన్ కల్యాణ్ పై సైతం విరుచుకుపడ్డారు. “దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. వారికి ఈ రాష్ట్రం కాకుంటే మరో రాష్ట్రం. ఈ ప్రజలు కాకుంటే మరో ప్రజలు. ఈ భార్య కాకుంటే మరో భార్య అన్నదే వారి తీరు. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తనవల్లేనని చంద్రబాబు చెప్పుకుంటారు. సింధుకు బ్యాడ్మింటన్ తానే నేర్పానని చెప్పుకుంటారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు, మోసాలు. అన్ని వర్గాలను మోసం చేసిన బాబును ప్రజలు ఎందుకు నమ్ముతారు” అంటూ జగన్ ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సీఎం జగన్.
జగన్ అన్నేసి మాటలంటే చంద్రబాబు ఊరుకుంటారా? ఆయన సైతం అదే రేంజ్ లో ఆగ్రహం ప్రదర్శించారు. కాకపోతే, టాపిక్ కందుకూరు కాదు బీసీలు. నెల్లూరు జిల్లా కావలిలో ‘ఇదేం ఖర్మ మన బీసీలకు’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. సీఎం జగన్ కి బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బీసీల కులవృత్తులను ముఖ్యమంత్రి ఎగతాళి చేస్తున్నారని.. రజకులు దుస్తులు ఉతికినట్టే.. జగన్ ను ఉతికి ఉతికి ఆరేయాలన్నారు చంద్రబాబు. అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమ అంశంపైనే తొలి సంతకం చేస్తానన్నారు.