Vizag Navy Day : ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ నౌకాదళ ఉత్సవాలకు ఈసారి ఏపీలోని విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నేవీ డే వేడుకలు జరుగడం ఇదే మొదటిసారి. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుంగా ఏటా డిసెంబర్ 4 నేవీ డేగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది న్యూఢిల్లీలో త్రివిధ దళాధిపతి అయిన భారత రాష్ట్రపతి సమక్షంలో వేడులను నిర్వహిస్తారు.
అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పాక్పై విజయంలో కీలకపాత్ర పోషించిన తూర్పు నావికా దళానికి కేంద్రమైన విశాఖలో ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, సైనిక ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
1971 డిసెంబర్ 4న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత నావికాదళం పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపైన మెరుపుదాడి చేసింది. నాలుగు యుద్ధ నౌకలను ధ్వంసం చేసి, బంగాళాఖాతంలో ప్రాదేశిక ప్రాంతాలను నేవీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు భారత వైమానిక దళం దాదాపు 4000 యుద్ధ వాహనాలతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను కలావికలం చేసింది.
భారత సైన్యం ముందు పాక్ ఎత్తులు నిలవలేక 15 రోజుల్లోనే డిసెంబర్ 16 న పూర్తిగా భారత దళాలకు లొంగిపోయింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు. ఏటా ఈ రోజునే నేవీ డేగా దేశంలోని నావికాదళ కమాండ్స్ నిర్వహిస్తున్నాయి. రక్షణ దళంలోని త్రివిధ దళాలు అత్యంత ఘనకీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారు.