Vizag Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో స్పీడ్ పెంచిన అధికార యంత్రాంగం కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖ, ఫోరెన్సిక్, పోలీస్శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. అలాగే క్రైమ్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
Vizag Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో స్పీడ్ పెంచిన అధికార యంత్రాంగం కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖ, ఫోరెన్సిక్, పోలీస్శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. అలాగే క్రైమ్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి రెండురోజుల్లో నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనకు తొలుత యూట్యూబర్ లోకల్ బాయ్ కారణమంటూ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే తమ దర్యాప్తులో లోకల్ బాయ్కి ఏ సంబంధం లేదని పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో నాని ఓ హోటల్లో పార్టీ చేసుకుని బయటకు వస్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్కావడంతో.. ఆ దృశ్యాల ఆధారంగా నానికి సంబంధం లేదని చెబుతున్నారు.
మత్స్యకారులకు కన్నీళ్లు పెట్టించిన ఘటనపై కూపీ లాగుతున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే విశాఖ అగ్నిప్రమాదం ఘటనపై స్పందించిన సీఎం జగన్ నష్టపరిహాన్ని ప్రకటించారు. ప్రమాదంలో కాలి బూడిదైన పడవలకు 80 శాతం పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
అటు విశాఖ అగ్ని ప్రమాద ఘటనపై పలు పార్టీల నేతలు ఆరా తీశారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాస్రావు, కొల్లు రవీంద్ర, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి మత్య్యకారులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా మత్స్యకారులకు వేటకు వెళ్లడానికి సమయం పడుతుంది కాబట్టి,.. జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. ఈ ఘటన తమను కలిచివేసిందని.. మత్స్యకారులకు ఏ మాత్రం నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బోట్లు కాలిపోయిన ఘటనలో విచారణలో జాప్యం తగదని.. వెంటనే ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు జీవీఎల్. ఫిషింగ్ హర్బర్లో పోలీసుల భద్రత అత్యవసరమని.. తక్షణమే ఖాకీలు సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు.
ఇక ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పెద్ద విపత్తు తప్పిందని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. బాధితులకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
ఆదివారం అర్థరాత్రి మత్స్యకారులు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 50కిపైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో సుమారు 40 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. తమకు ఉపాధినిచ్చే పడవలు కళ్ల ముందే కాలి బూడిదవుతుంటే కన్నీళ్లు పెడుతూ విలవిలలాడిపోయారు గంగపుత్రులు.