Vizag Crime: బాలికపై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విశాఖలో వెలుగుచూసింది. కామాంధుల్లా మారిన 10 మంది మానవ మృగాలు.. ఆ బాలికపై పిచ్చికుక్కల్లా విరుచుకుపడ్డారు. ఆ మృగాళ్ల చేతిలో ఆమె నరకాన్ని చవిచూసింది. ఒడిశా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికపై.. ఒక యువకుడు ప్రేమ వల విసిరాడు. ఆ వలలో చిక్కిన ఆమెను మాయమాటలతో మభ్యపెట్టి.. తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఆపై తన మిత్రుడిని ఉసిగొల్పాడు. లాడ్జిలో రెండురోజులపాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి.. అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఏపీ పొరుగు రాష్ట్రమైన ఒడిశాకు చెందిన ఒక కుటుంబం విశాఖపట్నంలోని కంచరపాలెంలో నివాసం ఉంటోంది. ఆ కుటుంబంలోని బాలిక.. రైల్వే న్యూ కాలనీలో ఉన్న ఒక ఇంటిలో కుక్కలకు ఆహారం పెట్టే పనిలో చేరింది. అక్కడ పనిచేస్తుండగా.. భువనేశ్వర్ కు చెందిన ఒక యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2023 డిసెంబర్ 18న బాలికకు మాయమాటలు చెప్పిన ప్రియుడు.. 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై తన స్నేహితుడిని అక్కడకు పిలిపించి.. అతనితోనూ అత్యాచారం చేయించాడు.
తీవ్రమనస్తాపానికి గురైన బాలిక.. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి ఏడుస్తుండగా.. పర్యాటకుల ఫొటోలు తీసే ఒక వ్యక్తి ఆమెను జగదాంబ కూడలి సమీపంలో ఉన్న మరో లాడ్జికి తీసుకెళ్లి.. బంధించాడు. అతనితో సహా స్నేహితులు 8 మంది 2 రోజులపాటు బాలికను చిత్రహింసలకు గురిచేస్తూ.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగొలా మృగాళ్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక.. ఒడిశాలోని కలహండి జిల్లాలోని సొంత ఊరికి వెళ్లిపోయింది.
కాగా.. డిసెంబర్ 18 నుంచి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు 4 టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా.. 22న ఆమె ఆచూకీ తెలుసుకుని విశాఖలోని ఇంటికి చేర్చారు. మానసిక ఆందోళనతో మిన్నకుండిన బాలిక.. డిసెంబర్ 31న తనకు జరిగిందంతా చెప్పింది. దీనిపై పోలీసులు పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి.. నగరానికి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న ప్రియుడు, అతడి స్నేహితుడిని పట్టుకునేందుకు ఝార్ఖండ్, విశాఖ నగరాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.