Vizag Camp Office : విజయదశమికి సీఎం జగన్ విశాఖను కేంద్రంగా చేసుకుని పాలన కొనసాగిస్తారనే ప్రచారం రెండు నెలలుగా జోరుగా కొనసాగుతుంది. దీంతో అధికారులు చకచకా సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు, అధికార యంత్రాంగానికి కావలసిన నివాసాలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. రుషికొండపై నిర్మాణం చేపడుతున్న సీఎం క్యాంప్ కార్యాలయం పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతోపాటు సీఎం జగన్ నివాసం ఉండే ఇంటి కోసం బేపార్క్ హోటల్ ను సిద్ధం చేశారు. సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ రెండూ సిద్ధం కావడంతో ఈనెల 23న సీఎం క్యాంపు కార్యాలయాన్ని జగన్ ప్రారంభించి 24వ తేదీన కూడా అక్కడే కుటుంబ సమేతంగా బస చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. వీటితోపాటు ఐఏఎస్ లు వివిధ శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు ఉండటానికి రాడిసన్ బ్లూ హోటల్ను, VMRDA పరిధిలో ఉన్నటువంటి కొన్ని భవనాలను సిద్ధం చేశారు.
ఇలా అన్ని సిద్ధం చేస్తున్న సమయంలో సీఎం జగన్ సంచలన విషయం చెప్పారు. మధురవాడలోనే ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్ కొత్త యూనిట్ ప్రారంభానికి వచ్చిన జగన్ డిసెంబర్ నాటికి వైజాగ్ నుంచి పాలన చేస్తామని.. వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. విశాఖ నుంచి పాలన డిసెంబర్ కు వాయిదా పడడానికి రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్యాలయాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం త్రీ మెన్ కమిటీ పేరుతో ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ త్రీ మెన్ కమిటీ విశాఖలో ఉన్న వివిధ కార్యాలయాల భవనాలను పరిశీలించి సీఎస్ కు నివేదిక ఇవ్వనున్నారు. త్రీ మెన్ కమిటీ వేయడం ఇంకా కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతోనే సీఎం షిఫ్టింగ్ డిసెంబర్కు వాయిదా పడిందని తెలుస్తోంది.
మరోపక్క డిసెంబర్ 30 వరకు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాజధాని విశాఖకు తరలిస్తే కోర్టు ధిక్కరణ కింద ప్రభుత్వంపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.. అందుకే సీఎం జగన్ విశాఖ కేంద్రంగా తన పాలనను డిసెంబర్కు వాయిదా వేసినట్టు ప్రచారం జరుగుతోంది.
రెండు నెలల నుంచి విజయదశమికి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారనే ప్రచారం జరుగుతున్నా కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అధికారులు చేసిన సూచనల మేరకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి విషయంలో ముందే లీకులను బయటపెట్టే మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రోజుల క్రితమే సీఎం జగన్ విశాఖ నుంచి తన పరిపాలన రేపే చేయొచ్చు నవంబర్ నుంచి లేదా డిసెంబర్ నుంచి ఒక లీకును బయటపెట్టారు. బొత్స చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సీఎం నోట బయటకు రావడంతో.. మరో రెండు నెలల వరకు విశాఖకు రాజధాని తరలిరావడం అనేది జరిగే పని కాదని తెలుస్తోంది.
జనవరి తర్వాత ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. 2024 ఎన్నికల తర్వాతే సీఎం జగన్ విశాఖకు రావడంపై ఆలోచన చేస్తారని మరో టాక్ కూడా నడుస్తోంది. మరి సీఎం జగన్ కోర్టు కేసుల గురించి వెనక్కి తగ్గారా? లేదా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలు వాయిదా వేశారా? అనేది సీఎం జగన్కు మాత్రమే తెలిసిన విషయం. మరి డిసెంబర్లోనైనా అన్నీ అనుకున్నట్టే జరుగుతాయా? ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖ అవతరిస్తుందా? మరికొంతకాలం పడుతుందా? తెలియాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే.