Viveka Murder Case: మాజీమంత్రి వివేకా హత్య కేసు దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తును అధికారులు వేగవంతం చేసింది. వివేకా హత్య సమయంలో లెటర్పై విచారణ చేపట్టింది. బుధవారం సీబీఐ విచారణకు వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి కొడుకు ప్రకాష్ హాజరయ్యారు. ఇద్దరినీ కలిపి సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. తాజాగా ఇతడిని సీబీఐ విచారిస్తోంది. మంగళవారం కృష్ణారెడ్డిని విచారించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నారు అధికారులు. బుధవారం మరోసారి కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్ను కలపి ప్రశ్నలవర్షం కురిపించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా దర్యాప్తు జరుపుతోంది. మంగళవారం సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. వీరితోపాటు తాజాగా మరికొందరు అనుమానితులకు కూడా సీబీఐ నోటీసులు అందజేసింది. వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిలను సీబీఐ మరోసారి ప్రశ్నించింది. వివేకా హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఇనయ్ తుల్లా ఉన్నాడు. అలాగే.. వివేకా మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బయటకు కూడా తీసుకొచ్చింది ఇనయ్ తుల్లానే. అతన్ని గతంలోనే పులివెందులలో సీబీఐ విచారించింది. మరోసారి సీబీఐ కార్యాలయంలో ఇనయతుల్లాను విచారించి.. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇనయతుల్లాతో పాటు ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్రెడ్డిల స్టేట్మెంట్ను కూడా సీబీఐ రికార్డ్ చేసింది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో కీలక అంశాలను ప్రస్తావించింది. అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉందని.. అయితే ఆయన దురుద్దేశపూర్వకంగా విచారణకు సహకరించటం లేదని సీబీఐ ఆరోపిస్తోంది. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా అవినాష్ రెడ్డి సమాధానాలు ఉన్నాయని.. అందుకే దర్యాప్తును తప్పించుకునేందుకే బెయిల్ పిటిషన్ వేశారని సీబీఐ తెలిపింది. అవినాష్ రెడ్డిని కష్టడిలో తీసుకొని ప్రశ్నిస్తేనే సరైన సమాధానాలు వస్తాయని చెబుతోంది.